సంక్షిప్త వార్తలు(3)

తను కలిసిన ప్రపంచ నాయకుల్లో అఫ్గానిస్థాన్‌ మాజీ ప్రధాని అష్రాఫ్‌ ఘనీ అత్యంత అవినీతిపరుడని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆరోపించారు.

Updated : 30 Jan 2023 06:10 IST

అష్రాఫ్‌ ఘనీ అత్యంత అవినీతిపరుడు
అమెరికా మాజీ విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో

వాషింగ్టన్‌: తను కలిసిన ప్రపంచ నాయకుల్లో అఫ్గానిస్థాన్‌ మాజీ ప్రధాని అష్రాఫ్‌ ఘనీ అత్యంత అవినీతిపరుడని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆరోపించారు. ఆయన ఇటీవల రాసిన పుస్తకంలో అఫ్గాన్‌ వ్యవహారాలపైనా తన అనుభవాలను పంచుకున్నారు. అష్రాఫ్‌ ఘనీ, ఆ దేశ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అబ్దుల్లా అబ్దుల్లాలు అత్యంత అవినీతిపరులని పాంపియో అభివర్ణించారు. ఘనీ ఎప్పుడూ పదవి కోసమే తాపత్రయపడుతూ తాలిబన్‌లతో శాంతి ఒప్పందాలకు అడ్డుగోడగా ఉండేవారని తెలిపారు. ఆయన తీరువల్ల అమెరికా అనేక మంది వీరులను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘనీతో చర్చల్లో కూర్చున్నపుడు కిమ్‌, జిన్‌పింగ్‌, పుతిన్‌లను ఒకేసారి కలిసినట్లు ఉండేదని పేర్కొన్నారు. అసలు ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది ఆలోచించకుండా ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లా పదవి కోసం పాకులాడేవారని పాంపియో తన పుస్తకంలో విమర్శలు గుప్పించారు.


ఇరాన్‌ రక్షణ కర్మాగారం లక్ష్యంగా డ్రోన్‌ దాడులు!

దుబాయి: ప్రాంతీయ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు నెలకొన్నవేళ.. ఇరాన్‌లోని ఓ రక్షణ కర్మాగారం లక్ష్యంగా శనివారం రాత్రి బాంబులతో కూడిన డ్రోన్‌ దాడులు జరిగాయి. ఈ దాడులతో ఇస్ఫహాన్‌లోని కర్మాగారం కొంతమేర దెబ్బతిన్నట్లు ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌ అధికారులు తెలిపారు. దాడుల్లో 3 డ్రోన్‌లు పాల్గొన్నాయని.. వాటిలో రెండింటిని నేల కూల్చినట్లు ఇరాన్‌ రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మూడోది కర్మాగారం భవనంపై దాడి చేయడంతో పైకప్పు కొంతమేర దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరిపై అనుమానాలున్నాయన్న విషయమై ఇరాన్‌ రక్షణ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణాన 350 కి.మీ.ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్‌లో అతిపెద్ద వైమానిక స్థావరంతో పాటు, అణు ఇంధన పరిశోధన, ఉత్పత్తి కేంద్రం కూడా ఉన్నాయి. కాగా ఇరాన్‌కు ఓవైపు ఇజ్రాయెల్‌, మరోవైపు అజర్‌బైజాన్‌లతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి.


పెరూలో బస్సు బోల్తా.. 25 మంది మృత్యువాత

లిమా: పెరూలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో 25మంది మరణించారు. మరికొంతమందికి గాయాలు అయ్యాయి. ఈక్వాడార్‌లోని పెరూ తీరప్రాంతం నుంచి శనివారం ఈ టూరిస్టు బస్సు బయలుదేరింది. ప్రమాదానికి అతివేగమే కారణమని.. దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని