పాక్‌ మసీదులో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్‌ లైన్స్‌లోని ఓ మసీదులో ఉగ్ర ముఠా తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) సభ్యుడొకరు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 31 Jan 2023 05:24 IST

ప్రార్థనలు జరుగుతుండగా పేల్చుకున్న మానవ బాంబు
61 మంది దుర్మరణం, 150 మందికి గాయాలు
ఉగ్ర ముఠా  టీటీపీ ప్రతీకార చర్య

పెషావర్‌: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్‌ లైన్స్‌లోని ఓ మసీదులో ఉగ్ర ముఠా తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) సభ్యుడొకరు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికిపైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పోలీసులు, సైనిక సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కనీసం అయిదుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, మసీదుకు చెందిన మత గురువు మౌలానా షహీబ్‌జాదా నూరుల్‌ అమీన్‌ మరణించినట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు మసీదులో భద్రతా సిబ్బంది సహా మరికొందరు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ముందు వరుసలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి తనను తాను పేల్చుకున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను లేడీ రీడింగ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పేలుడు ధాటికి మసీదులోని కొంత భాగం కూలిపోయిందని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో మసీదు వద్ద సుమారు 400 మంది పోలీసులు ఉన్నారని, దాడికి పాల్పడిన వ్యక్తి నాలుగంచెల భద్రతను దాటుకొని మసీదులోకి వెళ్లాడని పేర్కొన్నారు. అక్కడ భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నట్లు స్పష్టమవుతోందన్నారు. అఫ్గానిస్థాన్‌లో గతేడాది ఆగస్టులో తమ కమాండర్‌ ఉమర్‌ ఖలీద్‌ ఖురసానిని చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు టీటీపీ ప్రకటించింది. 2007లో ఏర్పాటైన టీటీపీ కొన్నేళ్లుగా పాక్‌ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. 27 మంది మృతులకు సాయంత్రం సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మాహుతి దాడిని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడినవారికి ఇస్లాంతో సంబంధం లేదని అన్నారు. ‘‘పాక్‌ను రక్షించే బాధ్యతల్లో ఉన్నవారిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజల్లో భయోత్పాతం సృష్టించాలని అనుకుంటున్నారు. దాడిలో మరణించినవారి త్యాగాలు వృథా కావు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తాం’’ అని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని