చైనా ఉపగ్రహాలకు సమాచారం ..?

అమెరికా, చైనాల మధ్య అగ్గిరాజేసిన బెలూన్‌ అంశంపై భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల విమానాలు నేలకు 12 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయి.

Published : 06 Feb 2023 04:35 IST

నిఘా బెలూన్‌పై అనుమానాలు

వాషింగ్టన్‌: అమెరికా, చైనాల మధ్య అగ్గిరాజేసిన బెలూన్‌ అంశంపై భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల విమానాలు నేలకు 12 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయి. యుద్ధవిమానాలు 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. నిఘా బెలూన్లు అత్యంత తేలికైన హీలియం వాయువుతో నిండి ఉండటంతో ఇవి భూమికి 24 కిమీ నుంచి 37 కిమీ ఎత్తులో ప్రయణిస్తాయి. వాటిలో సౌర ఫలకాలు ఉంటాయి. కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు, కమ్యూనికేషన్‌ పరికరాలనూ అమర్చుతారు. బెలూన్‌లో అమర్చిన రేడియో పరికరాల ద్వారా చైనా ఉపగ్రహాలకు సమాచారాన్ని ప్రసారం చేసే అవకాశం ఉందనే అనుమానాలను అధికారులు వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్‌ హయాంలో కూడా మూడు చైనా నిఘా బెలూన్లు అమెరికాపై ఎగిరినట్లు వారు చెబుతున్నారు.

అమెరికా అణుస్థావరాల వద్ద చైనా టెలికాం టెక్నాలజీ

మోంటానా రాష్ట్రం మధ్యలో మాల్మ్‌స్ట్రోమ్‌ వైమానిక స్థావరం ఉంది. ఇది అక్కడి మైదానాల్లోని 13,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. అక్కడే అణ్వస్త్ర సామర్థ్యమున్న వంద మినిట్‌మ్యాన్‌-3 క్షిపణులను నేలమాళిగల్లోని సైలోస్‌లో భద్రపరిచారు. ఈ బొరియలు ఒకదానికి మరొకటి దూరంగా ఉంటాయి. ఈ క్షిపణులు 6,000 మైళ్ల దూరంలోని లక్ష్యాలను నిమిషాల్లో చేరుకోగలవు. అస్త్రాలను ఉంచిన బొరియల మధ్యలో అమెరికా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సంస్థకు చెందిన సెల్‌ఫోన్‌ టవర్లు ఉన్నాయి. వాటిలో చైనాకు చెందిన హువావే కంపెనీ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ నెట్‌వర్క్‌ సాయంతో చైనా ఇక్కడి సైనిక స్థావరాలపై కీలక ఇంటెలిజెన్స్‌ సమాచారం సేకరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి హువావేను అమెరికాలోని పెద్ద కంపెనీలు ఇప్పటికే పక్కన పెట్టినా.. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఆ సంస్థ పరికరాలను టవర్లలో వినియోగిస్తున్నారు. ఇప్పుడు అక్కడే చైనా నిఘా బెలూన్‌ కొన్ని రోజుల పాటు ఎగరడం అనుమానాలకు తావిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు