ముషారఫ్‌ హయాంలో పరిష్కారం దిశగా కశ్మీర్‌ వివాదం!

ఎప్పటి నుంచో భారత్‌-పాక్‌ మధ్య నలుగుతూ వస్తున్న జమ్మూ-కశ్మీర్‌ వివాదానికి దాదాపు పరిష్కారం లభించినంత ప్రయత్నం పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ హయాంలో జరిగిందని పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్‌ మహ్మద్‌ కసూరి వెల్లడించారు.

Updated : 06 Feb 2023 06:08 IST

దిల్లీ: ఎప్పటి నుంచో భారత్‌-పాక్‌ మధ్య నలుగుతూ వస్తున్న జమ్మూ-కశ్మీర్‌ వివాదానికి దాదాపు పరిష్కారం లభించినంత ప్రయత్నం పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ హయాంలో జరిగిందని పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్‌ మహ్మద్‌ కసూరి వెల్లడించారు. 2004-07 మధ్య అనధికారిక చర్చల్లో నాలుగు అంశాలపై ఒక అవగాహనకు వచ్చి వివాదాన్ని పరిష్కరించేలా రంగం సిద్ధమైందనీ, కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ముందడుగు పడలేదని కసూరి పేర్కొన్నారు. ‘నైదర్‌ ఏ హాక్‌.. నార్‌ ఏ డోవ్‌’ పేరుతో ఈ పుస్తకం 2015లో ప్రచురితమైంది. చట్రం నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం సాధ్యమేననే భావన అప్పట్లో రెండు దేశాల నేతల్లోనూ వ్యక్తమైందని రచయిత పేర్కొన్నారు. 2001లో గుజరాత్‌లో సంభవించిన పెనుభూకంప విషాదంపై అప్పటి ప్రధాని వాజ్‌పేయీతో ముషారఫ్‌ ఫోన్లో మాట్లాడిన తర్వాత రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. వివాద పరిష్కారాన్ని ఏ దేశమూ తమ విజయంగా అభివర్ణించుకోకూడదని రెండు దేశాలూ అంగీకరించుకున్నాయని వివరించారు.

దావూద్‌ అప్పగింతపై ముషారఫ్‌తో మాట్లాడిన ఆడ్వాణీ

ఉగ్రవాది దావూద్‌ ఇబ్రహీంను విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించాలంటూ 2001లో అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్‌.కె.ఆడ్వాణీ చేసిన ప్రస్తావనతో ముషారఫ్‌ ముఖం కందగడ్డలా మారిపోయింది. దాని గురించి ఆడ్వాణీయే 2011లో ఒక బ్లాగులో రాసుకొచ్చారు. ఆగ్రా చర్చల కోసం భారత్‌కు వచ్చి, రాష్ట్రపతి భవన్‌లో బసచేసిన ముషారఫ్‌తో ఆడ్వాణీ భేటీ అయినప్పుడు ఇది చోటు చేసుకుంది. పాక్‌పై ముషారఫ్‌కు పూర్తి పట్టున్న రోజుల్లోనే అబోటాబాద్‌లో అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌లాడెన్‌ రహస్య స్థావరం నిర్మాణం జరిగిన విషయాన్నీ ఆడ్వాణీ ప్రస్తావించారు. దావూద్‌ తమ దేశంలో లేడని ముషారఫ్‌ అప్పుడు బుకాయించేసినా అది పచ్చి అబద్ధమని అదే సమావేశంలో పాల్గొన్న పాక్‌ అధికారి ఒకరు తనకు ఆ తర్వాత చెప్పినట్లు ఆడ్వాణీ బ్లాగులో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని