సంక్షిప్త వార్తలు (5)

వచ్చే ఏడాది భారత్‌ సందర్శించడానికి ప్రణాళిక చేస్తున్నట్లు పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆదివారం తెలిపారు. దక్షిణ సుడాన్‌ నుంచి రోమ్‌కు విమానంలో తిరుగు ప్రయాణం చేస్తున్న సందర్భంగా ఈ విషయాన్ని ఆయన తెలిపారు.

Updated : 06 Feb 2023 06:44 IST

వచ్చే ఏడాది పోప్‌ ఫ్రాన్సిస్‌ భారత్‌ పర్యటన

సుడాన్‌: వచ్చే ఏడాది భారత్‌ సందర్శించడానికి ప్రణాళిక చేస్తున్నట్లు పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆదివారం తెలిపారు. దక్షిణ సుడాన్‌ నుంచి రోమ్‌కు విమానంలో తిరుగు ప్రయాణం చేస్తున్న సందర్భంగా ఈ విషయాన్ని ఆయన తెలిపారు. మంగోలియా వెళ్లేందుకు ఉన్న అవకాశాలు పరిశీస్తున్నట్లు చెప్పారు. పోర్చుగల్‌లోని లిస్బన్‌ నగరంలో ఆగస్టు మొదటి వారంతో ప్రపంచ యువజన దినోత్సవానికి, సెప్టెంబరు 23న ఫ్రాన్స్‌లోని మార్సెల్లిలో నిర్వహించనున్న బిషప్‌ల సమావేశానికి హాజరవుతున్నట్లు చెప్పారు. 2017లో భారత్‌ పర్యటించాలనుకున్నా, సాధ్యం కాలేదన్నారు. దీంతో 2024లో ఇండియా వెళ్లాలని అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.


కశ్మీర్‌ ప్రజలకు అన్ని రకాలుగా పూర్తి సహకారం

మరోసారి ప్రకటించిన పాక్‌ ప్రధాని

ఇస్లామాబాద్‌: ఐరాస నిబంధనల ప్రకారం తమ అభీష్టం మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం పొందే వరకు కశ్మీర్‌ ప్రజలకు దౌత్యపరంగా, రాజకీయంగా తమ సహకారం ఉంటుందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి స్పష్టం చేశారు. ముజఫరాబాద్‌లో ఉన్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అసెంబ్లీలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఫిబ్రవరి 5ను కశ్మీర్‌ సౌభ్రాతృత్వ దినంగా నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షరీఫ్‌ ప్రసంగించారు.  కశ్మీర్‌ ‘అమరులకు’ నివాళులు అర్పించినట్లు పాక్‌ సైన్యం ప్రకటించింది. ఇక్కడి ప్రధాన నగరాల్లో కశ్మీర్‌కు మద్దతుగా రోడ్లపై పలు ప్రదర్శనలు జరిగాయి.


భారత్‌-బ్రిటన్‌ భద్రతా సలహాదారుల సమావేశంలో రిషి సునాక్‌

లండన్‌: భారత జాతీయ భద్రతా(ఎన్‌ఎస్‌ఏ) సలహాదారు అజిత్‌ డోభాల్‌, బ్రిటన్‌ భద్రతా సలహాదారు టిమ్‌ బారోల సమావేశంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సైతం ‘ప్రత్యేకంగా’ పాల్గొన్నారు. లండన్‌లోని యూకే కేబినెట్‌ కార్యాలయంలో శుక్రవారం ఈ సమావేశం జరిగింది. రక్షణ, వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత్‌కు బ్రిటన్‌ మద్దతు ఉంటుందని సునాక్‌ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. లండన్‌లోని భారత్‌ హై కమిషన్‌, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం రాత్రి ఈ మేరకు ప్రకటించాయి.


జెలెన్‌స్కీ ప్రాణాలు తీయబోనని పుతిన్‌ మాటిచ్చారు

వెల్లడించిన ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని బెన్నెట్‌

టెల్‌ అవీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చంపబోనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తనకు మాట ఇచ్చారని ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ వెల్లడించారు. ‘అదే విషయాన్ని జెలెన్‌స్కీకి ఫోన్‌ చేసి చెప్పా. నిజమా అని అడిగితే.. 100 శాతం పక్కా. మీకేం కాదు.’ అని చెప్పినట్లు బెన్నెట్‌ వివరించారు. ఇటీవల వెలువడిన ఓ ఐదు గంటల ముఖాముఖీలో పలు విషయాలను వివరిస్తూ ఆయన ఈ అంశాలను పంచుకున్నారు. ఆ రెండు దేశాల మధ్యా మధ్యవర్తిత్వం చేయడానికి బెన్నెట్‌ రష్యా వెళ్లినప్పటికీ అది సత్ఫలితాలను ఇవ్వలేదు.


యూట్యూబ్‌ స్టార్‌ ‘పరువు హత్య’

బాగ్దాద్‌లో మహిళా సంఘాల ఆందోళన

బాగ్దాద్‌: యూట్యూబ్‌ స్టార్‌గా రాణిస్తున్న యువతి టిబా అలి(22) తండ్రి చేతిలో ‘పరువు హత్య’కు గురైన ఘటనను ఖండిస్తూ బాగ్దాద్‌లో ఆదివారం ఆందోళనలు చేపట్టారు. టిబా టర్కీలోని ఇస్తాంబుల్‌లో నివసిస్తూ.. యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతోంది. ఆ ఛానల్‌కు 20 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సిరియాలో పుట్టి పెరిగిన తన ప్రియుడితో కలిసి ఆమె పలు డాక్యుమెంటరీలు తీసింది. అందులో ఉన్నత చదువు కోసం తాను టర్కీలో శాశ్వతంగా ఉంటానని చెప్పింది. ఈ నిర్ణయాన్ని తండ్రి వ్యతిరేకించాడు. ఇదే విషయమై ఇరాక్‌ వచ్చిన సందర్భంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తరువాత దివానియా నగరంలో జనవరి 31న టిబా నిద్రలో ఉండగా తండ్రి ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు ఇరాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సాద్‌ మాన్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ పరువు హత్యను వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. మహిళల రక్షణకు పటిష్ఠ చట్టాలు తీసుకురావాలని వారు నినదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని