ఒహైయోను వణికిస్తున్న రైలు ప్రమాదం

అమెరికాలోని ఒహైయో-పెన్సిల్వేనియా రాష్ట్రాల మధ్య ఈస్ట్‌ పాలస్టైన్‌ గ్రామం వద్ద ఈ నెల 4న ప్రమాదానికి గురైన రైలు స్థానికంగా ఆందోళనలకు గురిచేస్తోంది.

Updated : 17 Feb 2023 10:29 IST

వాతావరణంలోకి విషపూరిత వాయువులు?

ఒహైయో: అమెరికాలోని ఒహైయో-పెన్సిల్వేనియా రాష్ట్రాల మధ్య ఈస్ట్‌ పాలస్టైన్‌ గ్రామం వద్ద ఈ నెల 4న ప్రమాదానికి గురైన రైలు స్థానికంగా ఆందోళనలకు గురిచేస్తోంది. ఆ రైలులో తరలిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వినైల్‌ క్లోరైడ్‌ రసాయనం దీనికి కారణం. ఆ ఘటనలో సుమారు 50 వ్యాగన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ నేపథ్యంలో గాల్లో కలిసిందని భావిస్తున్న ఆ రసాయనంలో క్యాన్సర్‌ కారకాలు ఉంటాయని అమెరికా నేషనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ హెచ్చరించింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి దాదాపు ఒక మైలు దూరంపాటు గాల్లో చోటు చేసుకొంటున్న మార్పులను అమెరికా గమనిస్తోంది. ఆ ప్రదేశంలో భూగర్భజలాలకూ పరీక్షలు చేయిస్తోంది. తుది ఫలితాలు వచ్చే వరకూ ప్రజలు రక్షిత నీటినే వినియోగించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ మైక్‌ డివైన్‌ సూచించారు. 150 వ్యాగన్లతో మాడిసన్‌ నుంచి బయల్దేరిన ఈ రైలు పెన్సిల్వేనియాలోని కాన్వేకు చేరుకోవాల్సి ఉంది. దీనిలో 11 వ్యాగన్లలో వినైల్‌ క్లోరైడ్‌, బ్యూటైల్‌ అక్రలేట్‌ వంటి ప్రమాదకర రసాయనాలను తరలిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లోని వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వారిని దాదాపు 5 రోజులపాటు అక్కడే ఉంచి తర్వాత ఇళ్లకు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని