భారతీయులకు దేశ విదేశాల్లో అమెరికా వీసా ఇంటర్వ్యూలు

భారత్‌, అమెరికా ప్రజల మధ్య సంబంధాలే రెండు దేశాల స్నేహవారధికి పటిష్ఠ పునాది అనీ, వాటిని మరింత పరిపుష్టం చేసుకోవడానికి వీసా నిరీక్షణ వ్యవధిని తగ్గిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ (దక్షిణ, మధ్యాసియా వ్యవహారాల) ఉప సహాయమంత్రి నాన్సీ జాక్సన్‌ చెప్పారు.

Updated : 23 Feb 2023 07:23 IST

వాషింగ్టన్‌: భారత్‌, అమెరికా ప్రజల మధ్య సంబంధాలే రెండు దేశాల స్నేహవారధికి పటిష్ఠ పునాది అనీ, వాటిని మరింత పరిపుష్టం చేసుకోవడానికి వీసా నిరీక్షణ వ్యవధిని తగ్గిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ (దక్షిణ, మధ్యాసియా వ్యవహారాల) ఉప సహాయమంత్రి నాన్సీ జాక్సన్‌ చెప్పారు. భారత్‌, భారత సంతతి ప్రజల అధ్యయన సంస్థ ఎఫ్‌.ఐ.ఐ.డి.ఎస్‌, అమెరికా విదేశాంగ శాఖ సంయుక్తంగా ఇక్కడ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. భారతీయుల వీసా కష్టాలు సహా పలు సమస్యలపై కొన్ని నెలలుగా బైడెన్‌ ప్రభుత్వంతో ఎఫ్‌.ఐ.ఐ.డి.ఎస్‌ సంప్రదిస్తోంది. వీసా నిరీక్షణ వ్యవధిని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకున్నామని విదేశాంగ శాఖ (దౌత్య వ్యవహారాల) ఉప సహాయమంత్రి జూలీ స్టఫ్ట్‌ వివరించారు. వీటివల్ల కొవిడ్‌ ముందునాటి కన్నా 36 శాతం ఎక్కువ వీసాలు మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది మరిన్ని ఎక్కువ వీసాలు ఇస్తామన్నారు. మొదటిసారి అమెరికా సందర్శనకు వచ్చేవారికి విజిటర్‌ వీసా ఇంటర్వ్యూల కోసం నిరీక్షణ వ్యవధిని ఇప్పటికే 14 నెలల మేరకు తగ్గించామని స్టఫ్ట్‌ తెలిపారు. దీన్ని మరింత తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రెండోసారి అమెరికా వస్తున్నవారికి, మరికొన్ని వర్గాలకు వీసా ఇంటర్వ్యూలను రద్దు చేశామని చెప్పారు. ఇంటర్వ్యూల నిర్వహణకు అమెరికా నుంచి భారత్‌కు అదనపు సిబ్బందిని పంపామనీ, అమెరికాలోనూ, థాయిలాండ్‌, జర్మనీ తదితర దేశాల్లోని తమ దౌత్య కార్యాలయాల్లోనూ భారతీయులకు వీసా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదాహరణకు చైనాలో వారిని ఇంటర్వ్యూ చేసి, వారికి మంజూరైన వీసాలను భారత్‌లో ముద్రించి స్థానిక చిరునామాలకు పంపుతున్నామని వివరించారు. 100 దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో భారతీయులకు వీసా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని