ఇమ్రాన్‌పై నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌.. 13 వరకూ నిలుపుదల చేసిన కోర్టు

తోషఖానా కేసులో నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంటును ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మంగళవారం ఇస్లామాబాద్‌ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

Updated : 08 Mar 2023 06:21 IST

ఇస్లామాబాద్‌: తోషఖానా కేసులో నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంటును ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మంగళవారం ఇస్లామాబాద్‌ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అరెస్టు వారెంట్‌ను ఈ నెల 13 వరకూ నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. తమ అధినేతపై ఇచ్చిన అరెస్టు వారెంట్‌ను కొట్టేయాలని పాకిస్థాన్‌ తెహరీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఇస్లామాబాద్‌ హైకోర్టును సోమవారం ఆశ్రయించింది. వాస్తవానికి తోషఖానా కేసులో మంగళవారం ఆయన విచారణ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ గైర్హాజరయ్యారు. ఆయన ఇలా వ్యవహరించడం ఇది నాలుగోసారి. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆదేశిస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆమిర్‌ ఫారూఖ్‌ తీర్పిచ్చారు. న్యాయస్థానానికి హాజరయ్యేందుకు ఇమ్రాన్‌కు నాలుగు వారాల సమయం ఇవ్వాలన్న న్యాయవాది విజ్ఞప్తిని తిరస్కరించారు.

దేశ కానుకల విభాగం (తోషఖానా) నుంచి ఇమ్రాన్‌ బహుమతులు స్వీకరించారని, ఖరీదైన చేతిగడియారాన్ని డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేసి... వాటిని అధిక ధరకు విక్రయించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వీటి విషయమై ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా డిక్లరేషన్‌లోనూ నిజాలు దాచారంటూ ఎన్నికల సంఘం ఆరోపిస్తూ విచారణ చేయాలని గత ఏడాది అక్టోబరులో ఇస్లామాబాద్‌ సెషన్స్‌ కోర్టును కోరింది. ఈ కేసులో మూడుసార్లు విచారణకు హాజరు కానందుకు ఇమ్రాన్‌పై సెషన్స్‌కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 28న అరెస్టు వారెంటు జారీ చేసి, కేసును మార్చి 7కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని