UNO: స్వచ్ఛమైన తాగునీటికి దూరంగా 26 శాతం ప్రపంచ జనాభా

ప్రపంచ జనాభాలో 26 శాతం మంది స్వచ్ఛమైన తాగునీరు పొందలేకపోతున్నారని, 46 శాతం మందికి కనీస పారిశుద్ధ్యం అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి (ఐరాస) వెల్లడించింది.

Updated : 23 Mar 2023 08:17 IST

కనీస పారిశుద్ధ్యం పొందలేనివారు 46 శాతం
వెల్లడించిన ఐరాస నివేదిక

ఐరాస: ప్రపంచ జనాభాలో 26 శాతం మంది స్వచ్ఛమైన తాగునీరు పొందలేకపోతున్నారని, 46 శాతం మందికి కనీస పారిశుద్ధ్యం అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి (ఐరాస) వెల్లడించింది. 45 ఏళ్ల తర్వాత జలవనరులపై మొదటిసారిగా ఐరాస సుదీర్ఘ సదస్సు నిర్వహించింది. ఆ అంశాలను ప్రస్తావిస్తూ ‘ఐరాస ప్రపంచ జల అభివృద్ధి నివేదిక 2023’ను విడుదల చేసింది. 2030లోగా ప్రపంచ జనాభా మొత్తం శుద్ధ జలం, పారిశుద్ధ్యాన్ని పొందాలన్న లక్ష్యాలను చేరుకోవడానికి, ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ నివేదిక ఎత్తిచూపింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి 600 బిలియన్‌ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్‌ డాలర్లు అవసరమని నివేదిక ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ రిచర్డ్‌ కానర్‌ వెల్లడించారు.  

ముంచుకొస్తున్న నీటి ఎద్దడి

పర్యావరణ మార్పుల కారణంగా మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియాలతో పాటు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సీజన్ల వారీ నీటి కొరతను ఎదుర్కొంటాయని, ఇప్పటికే గడ్డు పరిస్థితుల్లో ఉన్న పశ్చిమాసియా, సహారా పరీవాహక ప్రాంతాలు దుర్భర భవిష్యత్తు వైపు పయనిస్తున్నాయని నివేదిక హెచ్చరించింది. సగటున ప్రపంచ జనాభాలో 10 శాతం మంది కటిక నీటి కొరత ఉన్న దేశాల్లో నివసిస్తుండగా, 350 కోట్ల మంది ప్రజలు ఏడాదికి కనీసం ఒక నెల నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో నివేదిక ఒకటి వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని