సంక్షిప్త వార్తలు(2)

గర్భిణులు కరోనా మహమ్మారి బారిన పడితే.. వారికి పుట్టబోయే పిల్లలకు ఊబకాయం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని అమెరికా పరిశోధకులు గుర్తించారు.

Updated : 31 Mar 2023 05:59 IST

గర్భిణికి కొవిడ్‌ సోకితే.. పుట్టబోయే పిల్లలకు ఊబకాయ ముప్పు

వాషింగ్టన్‌: గర్భిణులు కరోనా మహమ్మారి బారిన పడితే.. వారికి పుట్టబోయే పిల్లలకు ఊబకాయం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని అమెరికా పరిశోధకులు గుర్తించారు. తాజా అధ్యయనంలో భాగంగా మొత్తం 280 మంది చిన్నారుల పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. ఈ చిన్నారుల్లో 150 మంది గర్భస్థ శిశువులుగా ఉండగానే.. వారి తల్లులకు కరోనా సోకింది. మిగిలిన 130 మంది సాధారణ చిన్నారులతో పోలిస్తే వారు తక్కువ బరువుతో జన్మించారు. పుట్టాక తొలి ఏడాది కాలంలో వేగంగా బరువు పెరిగారు. ఈ మార్పుల కారణంగా వారు బాల్యంలోనే ఊబకాయం, మధుమేహం, గుండె-రక్తనాళాల సంబంధిత వ్యాధుల బారిన పడే ముప్పు అధికమైందని పరిశోధకులు తేల్చారు.


‘పాక్‌ సీజే అధికారాల కోత’ బిల్లుకు ఎగువసభ ఆమోదం

ఇస్లామాబాద్‌: సుమోటో కేసుల స్వీకరణ, ధర్మాసనాల ఏర్పాటులో పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)కున్న సంపూర్ణ అధికారాలను తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆ దేశ పార్లమెంటు ఎగువ సభ(సెనెట్‌) ఆమోదించింది. ‘ది సుప్రీంకోర్టు(ప్రాక్టీస్‌ అండ్‌ ప్రొసీజర్‌)బిల్‌-2023’కు 60-19 మెజార్టీతో ఆమోదం తెలిపింది. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీకి చెందిన సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. బుధవారం ఈ బిల్లుకు దిగువ సభ అయిన జాతీయ అసెంబ్లీ ఆమోదం దక్కిన సంగతి తెలిసిందే. తదుపరి ఈ బిల్లును దేశాధ్యక్షుడు అరీఫ్‌ అల్వీ ఆమోదానికి పంపనున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు