జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకోవచ్చు
అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ ఉద్యోగాలు చేయకుండా అడ్డుకోవాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వేసిన పిటిషన్ను అమెరికా కోర్టు కొట్టివేసింది.
హెచ్-1బి వీసాదారులకు సంబంధించి అమెరికా కోర్టు కీలక తీర్పు
వాషింగ్టన్: అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ ఉద్యోగాలు చేయకుండా అడ్డుకోవాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వేసిన పిటిషన్ను అమెరికా కోర్టు కొట్టివేసింది. హెచ్-1బి వీసాదారుల భార్య/భర్త అమెరికాలో నిరభ్యంతరంగా పనిచేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే ఉంటారు. ఇటీవల సాఫ్ట్వేర్ రంగంలో లేఆఫ్ల కారణంగా భారీస్థాయిలో ఉద్యోగాలను కోల్పోయిన నేపథ్యంలో ఈ తీర్పుతో సాంత్వన లభించింది. హెచ్-1బి వీసాలపై అమెరికా వచ్చే ఉద్యోగుల భాగస్వాములు (హెచ్-4 వీసాదారులు) కూడా అక్కడ పనిచేసుకునేలా ఒబామా హయాంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమెరికా ఇప్పటివరకు హెచ్-4 వీసాదారులకు లక్ష వర్క్ ఆథరైజేషన్లు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేసింది. హెచ్1-బి వీసాదారుల కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆ సంస్థ వాదిస్తోంది. అయితే ఈ పిటిషన్ను న్యాయమూర్తి తాన్యా ఛుట్కన్ కొట్టివేశారు. ‘‘హెచ్-4 వీసాదారులు అమెరికాలో పని చేసుకోవడానికి అనుమతి ఇవ్వడానికి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అథారిటీకి అమెరికా కాంగ్రెస్(పార్లమెంటు) అధికారం కట్టబెట్టలేదని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ తన వ్యాజ్యంలో ప్రధానంగా పేర్కొంది. కానీ, ఈ వాదన దశాబ్దాలుగా కాంగ్రెస్ అనుమతులతో కార్యనిర్వాహక శాఖ చేస్తున్న పనికి విరుద్ధంగా ఉంది. హెచ్-4 వీసాదారులకు పనిచేసుకునే అవకాశం కల్పించేందుకు అమెరికా ప్రభుత్వానికి కాంగ్రెస్ స్పష్టమైన అధికారం ఇచ్చింది. ఈ వీసాదారులకు ఉపాధి కల్పించే బాధ్యత సమాఖ్య ప్రభుత్వానికి ఉంది. అందుకే విద్యార్థులకే కాకుండా హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు, వారిపై ఆధారపడిన వారికి కూడా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అథారిటీ ఉద్యోగాలను కల్పిస్తూ వస్తోంది. అలాగే విదేశీ ప్రభుత్వాల అధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా దీర్ఘకాలిక ఉపాధిని చూపుతోంది’’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుపై తాము అప్పీలుకు వెళ్లనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా