చాట్‌ జీపీటీపై ఇటలీలో నిషేధం

ప్రపంచవ్యాప్తంగా చాట్‌ జీపీటీ నేడు చర్చనీయాంశంగా మారగా.. దీని వాడకంపై ఇటలీ నిషేధం విధించింది. చాట్‌జీపీటీ అనేది కృత్రిమమేధతో కూడిన కంప్యూటర్‌ అప్లికేషన్‌.

Published : 02 Apr 2023 04:09 IST

రోమ్‌: ప్రపంచవ్యాప్తంగా చాట్‌ జీపీటీ నేడు చర్చనీయాంశంగా మారగా.. దీని వాడకంపై ఇటలీ నిషేధం విధించింది. చాట్‌జీపీటీ అనేది కృత్రిమమేధతో కూడిన కంప్యూటర్‌ అప్లికేషన్‌. టెక్‌ రంగంలోకి దీని ప్రవేశంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐరోపా దేశం ఇటలీ ఈ అప్లికేషనుపై నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చేలా ఇటలీ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో చాట్‌జీపీటీని బ్లాక్‌ చేశారు. ఈ చాట్‌బాట్‌ను బ్లాక్‌ చేసిన మొదటి ఐరోపా దేశం ఇటలీనే కావడం గమనార్హం. తాము చాట్‌జీపీటీని బ్లాక్‌ చేస్తున్నట్లు శుక్రవారం ఇటాలియన్‌ డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ వెల్లడించింది. అలాగే ఇది తమ దేశ సమాచార భద్రతా నియంత్రణలకు లోబడి ఉందా.. లేదా అనేదానిపై విచారణ జరుపుతామని తెలిపింది. డేటా ఉల్లంఘనకు సంబంధించిన కేసు తమ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దీనిపై చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా నిషేధం విధించాయి. గతేడాది చివరలో చాట్‌జీపీటీ ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. రావడంతోనే సాంకేతికరంగంలో ఎంతో ప్రాచుర్యం సొంతం చేసుకుంది. దాదాపు అన్ని టెక్‌ దిగ్గజ సంస్థలు దీనిపై దృష్టి సారించాయి. చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐకి మైక్రోసాఫ్ట్‌ సహకారముంది. ఆ సంస్థ ఇందులో పెట్టుబడులు పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని