భార్య కోసమే కొత్త బడ్జెట్‌ పాలసీ

బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిషి సునాక్‌ను విమర్శలు, వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

Published : 02 Apr 2023 04:37 IST

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌పై విమర్శలు

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిషి సునాక్‌ను విమర్శలు, వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మార్చి ఆరంభంలో బ్రిటన్‌ ప్రభుత్వం స్ప్రింగ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో చిన్నారుల సంరక్షణకు ఆయాల (ఛైల్డ్‌ మైండర్స్‌) సేవలను అందించే కంపెనీలకు ప్రోత్సాహాకాలు కల్పించేలా నూతన పైలట్‌ పథకాన్ని ప్రకటించారు. కాగా.. ఇలాంటి సేవలనే అందించే ‘కోర్‌ కిడ్స్‌ లిమిటెడ్‌’ అనే కంపెనీలో రిషి సతీమణి అక్షతా మూర్తి వాటాదారుగా ఉన్నారు. దీంతో భార్య వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రధాని ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రవేశపెట్టారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఈ పథకాన్ని తేవడం వెనుక ప్రత్యేక ఆసక్తి ఏమైనా ఉందా? సొంత ప్రభుత్వ విధానాల నుంచి రిషి సునాక్‌ కుటుంబం అదనపు ఆదాయాన్ని పొందాలనుకుంటుందా? ఈ ప్రశ్నలకు సునాక్‌ సమాధానం చెప్పాల్సిందే’’ అని ప్రతిపక్ష లిబరల్‌ డెమోక్రాట్‌ చీఫ్‌ విప్‌ వెండీ ఛాంబెర్లెన్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ ఈ ఆరోపణలను ఖండించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని