King Charles III: పట్టాభిషేకం వేళ... 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు

బ్రిటన్‌ రాజుగా తన పట్టాభిషేకం అనంతరం ఛార్లెస్‌ సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు అందించనున్నారు.

Updated : 06 May 2023 07:50 IST

లండన్‌: బ్రిటన్‌ రాజుగా తన పట్టాభిషేకం అనంతరం ఛార్లెస్‌ సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు అందించనున్నారు. పట్టాభిషేక కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొన్న వివిధ శాఖల సిబ్బందికి, దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, పోలీసు, అత్యవసర సేవల సిబ్బందికి వీటిని అందించనున్నట్లు భారతీయ మూలాలున్న బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్‌ తెలిపారు. ఇందుకోసం ఛార్లెస్‌, కెమిల్లా ప్రతిమలతో కూడిన పతకాలను తయారు చేశారు.

ఈసారి రాజు హోదాను సూచిస్తూ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యులు బహూకరించే చిహ్నాల్లో తొలిసారిగా హిందూ, జైన, సిక్కు తదితర మతాలకు చెందినవి కూడా ఉండబోతున్నాయి. పట్టాభిషేకం సందర్భంగా ఛార్లెస్‌ అన్ని సమాజాలకు సేవ చేసే సార్వభౌమాధికారం కోసం గట్టిగా ప్రార్థించనున్నారు. కార్యక్రమంలో హిందువులు, యూదులు, సిక్కులు, ముస్లింలు, బౌద్ధులు తదితర మత ప్రతినిధుల నుంచి ఛార్లెస్‌ అభినందనలు స్వీకరిస్తారు.

ఈ వేడుకను వీక్షించేందుకు వేల సంఖ్యలో ప్రజలు వెస్ట్‌మినిస్టర్‌ అబేకు చేరుకోనున్నారు. పెద్ద తెరలపై ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని లక్షల మంది వీక్షిస్తారని అంచనా. ‘‘నేను మీ రాజ హోదాకు, మీ వారసులకు చట్టపరంగా నిజమైన విధేయత చూపుతాను. అందుకు సాయం చేయమని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’’ అని వారు నినదిస్తారు.

బ్రిటన్‌కు చెందిన భారతీయ మూలాలున్న ప్రముఖ షెఫ్‌ మంజూ మల్హిల్‌ ఈ వేడుకలో అతిథిగా పాల్గొనబోతున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఓ వృద్ధాశ్రమంలోని వారికి వర్చువల్‌ విధానంలో పాకశాస్త్ర తరగతులు నిర్వహించి సేవ చేసినందుకు ఆమెకు గతంలో రాణి ఎలిజబెత్‌-2 బ్రిటిష్‌ ఎంపైర్‌ మెడల్‌ను అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని