Corona Vaccine: బరువును మోయలేకపోతున్న కొవిడ్‌ టీకా

కొవిడ్‌-19 కట్టడికి రూపొందించిన టీకాలు చాలా సమర్థంగా పనిచేస్తున్నాయి. అయితే వయోధికులతోపాటు క్యాన్సర్‌ వంటి రుగ్మతల కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి మాత్రం అవి అంత బలమైన రక్షణను ఇవ్వవని నిపుణులు చెబుతున్నారు.

Updated : 16 May 2023 07:29 IST

ఊబకాయుల్లో వేగంగా తగ్గిపోతున్న వ్యాక్సిన్‌ సామర్థ్యం  

కేంబ్రిడ్జ్‌: కొవిడ్‌-19 కట్టడికి రూపొందించిన టీకాలు చాలా సమర్థంగా పనిచేస్తున్నాయి. అయితే వయోధికులతోపాటు క్యాన్సర్‌ వంటి రుగ్మతల కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి మాత్రం అవి అంత బలమైన రక్షణను ఇవ్వవని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వారికి కొవిడ్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఊబకాయం, దానితో ముడిపడిన టైప్‌-2 మధుమేహం, అధికరక్తపోటు, దీర్ఘకాల కిడ్నీ వ్యాధులు కూడా తీవ్రస్థాయి కరోనా ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే స్థూలకాయం వల్ల కొవిడ్‌ టీకా సమర్థతలో ఏమైనా తేడాలు ఉండొచ్చా అన్నదానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. బ్రిటన్‌ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. ఊబకాయం ఉన్నవారిలో కొవిడ్‌ టీకాల రక్షణ త్వరగా తగ్గిపోతుందని తేల్చారు.

కొవిడ్‌ వ్యాక్సిన్లు.. యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. అవి కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్లను గుర్తించి, వాటిని నిలువరిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థలోని టి కణాలకూ వ్యాక్సిన్లు శిక్షణ ఇస్తాయి. ఆ వైరస్‌ సోకితే తీవ్రస్థాయి కొవిడ్‌ బారినపడకుండా రక్షించేలా ఆ కణాలు చూస్తాయి. టీకా రెండు డోసులు పొందాక మనకు లభించే రోగనిరోధక శక్తి.. కొద్దినెలల తర్వాత క్షీణిస్తుంది. అందువల్ల కొవిడ్‌ నుంచి రక్షణ కొనసాగేలా చూడటానికి అనేక దేశాలు బూస్టర్‌ డోసులను ఇస్తున్నాయి. సాధారణ ప్రజలతో పోలిస్తే.. ఊబకాయం ఉన్నవారిలో కొవిడ్‌-19 టీకా వల్ల ఉత్పత్తయ్యే యాంటీబాడీలు తక్కువగా ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిపై పరిశోధన కోసం కేంబ్రిడ్జ్‌, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు స్కాట్లాండ్‌లోని 54 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్యడేటాను పరిశీలించారు. ముఖ్యంగా.. ఫైజర్‌ లేదా ఆస్ట్రాజెనెకా సంస్థలు ఉత్పత్తి చేసిన టీకాలు (రెండు డోసులు) పొందిన 35 లక్షల మంది వివరాలను నిశితంగా గమనించారు.

అందులో వెల్లడైన అంశాలివీ..

తీవ్ర ఊబకాయం (బీఎంఐ 40 కన్నా ఎక్కువ) ఉన్నవారికి టీకాలు తీసుకున్నాక కూడా కొవిడ్‌తో ఆసుపత్రిపాలు కావడం లేదా మరణం బారినపడే ముప్పు 76 శాతం ఎక్కువ.

స్థూలకాయం ఉన్నవారికి (బీఎంఐ 30 నుంచి 40 శాతం) ఒక మోస్తరుస్థాయిలో ముప్పు ఉంటుంది. బరువు తక్కువగా ఉన్నవారి (బీఎంఐ 18.5 శాతం కన్నా తక్కువ)లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

తీవ్రస్థాయి ఊబకాయులు.. రెండో డోసు పొందిన 10 వారాల తర్వాత తీవ్ర కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ముప్పును ఎదుర్కొంటున్నారు. స్థూలకాయం ఉన్నవారిలో అది 15 వారాలుగా, సాధారణ బరువు కలిగినవారిలో అది 20 వారాలుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని