అమెరికా అధ్యక్షుణ్ని చంపాలనుకున్నా

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌   హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకువచ్చిన 19 ఏళ్ల భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్‌.. పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు.

Updated : 25 May 2023 09:39 IST

6 నెలల నుంచి ప్రణాళిక రచిస్తున్నా : సాయి వర్షిత్‌
హిట్లర్‌ అంటే నాకిష్టం.. అందుకే నాజీ జెండా కొన్నా
విచారణలో వెల్లడించిన వైట్‌హౌస్‌పై దాడి నిందితుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌   హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకువచ్చిన 19 ఏళ్ల భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్‌.. పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు. శ్వేతసౌధాన్ని నియంత్రణలోకి తీసుకొని అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనే.. తాను దాడికి పాల్పడ్డానని, ఈ క్రమంలో అవసరమైతే అధ్యక్షుడిని, అడ్డం వచ్చే ఎవరినైనా చంపేందుకు వెనుకాడకూడదని నిశ్చయించుకున్నానని తెలిపాడు. మిసోరిలోని ఛెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌.. సోమవారం రాత్రి సెయింట్‌ లూయిస్‌ నుంచి డలెస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. విమానాశ్రయం దగ్గరే ఓ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా శ్వేతసౌధం ఉత్తరభాగంలోని లాఫియెట్‌ పార్క్‌కు చేరుకున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.35 గంటలకు పార్క్‌ సమీపంలోని బ్యారికేడ్లను ట్రక్కుతో ఢీకొట్టాడు. ట్రక్కును వెనక్కి తీసుకొని మళ్లీ వాటిని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో వర్షిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదకరమైన ఆయుధంతో దాడి, మోటారు వాహనం నడపడంలో నిర్లక్ష్యం, అధ్యక్షుడిని, ఉపాధ్యక్షురాలిని, వారి కుటుంబ సభ్యులను చంపుతానని, కిడ్నాప్‌ చేస్తానని, గాయపరుస్తానని బెదిరించడం. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం తదితర అభియోగాలను నమోదు చేశారు.

నేర చరిత్ర లేదు

మిసోరిలోని ఛెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ది భారత సంతతికి చెందిన కుటుంబం. 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ లాంగ్వేజీలపై పట్టున్న అతడు.. డేటా అనలిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతడి లింక్డిన్‌ ప్రొఫైల్‌ ద్వారా తెలిసింది. కాగా.. నిందితుడిపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్‌ రికార్డ్‌ లేదని పోలీసులు వెల్లడించారు. వర్షిత్‌ స్నేహితులు ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా మంచి వ్యక్తి అని.. సరదాగా ఉంటాడని మార్క్వెట్‌లో వర్షిత్‌తో కలిసి చదువుకున్న ఈరియన్‌ బార్‌ఫీల్డ్‌ తెలిపారు. ‘‘మానసికంగా ఏదో సంఘర్షణకు గురైనట్లు ఉన్నాడు. లేకపోతే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో’’ అని మరో స్నేహితుడు పేర్కొన్నాడు.

మానసిక స్థితిపై దర్యాప్తు..

ఈ దాడికి ఆరు నెలల నుంచి ప్రణాళిక రచిస్తున్నానని విచారణలో వర్షిత్‌ పేర్కొన్నాడు. ‘‘శ్వేతసౌధంలోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే నా లక్ష్యం’’ అని తెలిపాడు. అధికారాన్ని ఎలా దక్కించుకుంటావని సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్స్‌ అడగ్గా.. ‘‘అవసరమైతే బైడెన్‌ను చంపేయాలనుకున్నా. లేదా అక్కడున్న వారిలో ఎవరినైనా గాయపర్చడమో, చంపడమో చేయాలనుకున్నా’’ అని వర్షిత్‌ బదులిచ్చినట్లు అధికారులు చెప్పారు. సాయి వర్షిత్‌ వద్ద నాజీ జెండాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని గురించి ప్రశ్నించగా.. తాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు తెలిపాడు. జర్మనీ నియంత హిట్లరంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు ‘‘హిట్లర్‌ బలమైన నేత. నాజీలకు గొప్ప చరిత్ర ఉంది’’ అని నిందితుడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో సాయి వర్షిత్‌ మానసిక పరిస్థితిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకోసం అతడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని