హరిత ఇంధనాలపై పెరుగుతున్న పెట్టుబడులు

ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల చమురు సరఫరాలో ఏర్పడిన అనిశ్చితి, ధనిక దేశాల విధానాలు హరిత ఇంధనాలపై పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తున్నాయి.

Published : 28 May 2023 05:03 IST

అంతర్జాతీయ ఇంధన సంస్థ

జకార్తా: ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల చమురు సరఫరాలో ఏర్పడిన అనిశ్చితి, ధనిక దేశాల విధానాలు హరిత ఇంధనాలపై పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఈ పెట్టుబడులు బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలపై వెచ్చిస్తున్న నిధులను మించిపోవడం స్వాగతించాల్సిన అంశమని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తెలిపింది. అయితే 2023లో బొగ్గుపై పెట్టుబడులు 10 శాతం పెరగనుండటం ఒక అపశ్రుతి. 2022లో 40 గిగావాట్ల ఉత్పాదన సామర్థ్యం గల కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలను నిర్మించారనీ, దాదాపు అవన్నీ చైనాలోనే వెలిశాయని ఐఈఏ వెల్లడించింది. విద్యుత్‌ సరఫరా కన్నా గిరాకీ పెరిగిపోవడం శిలాజ ఇంధనాలపై ఇంకా ఆధారపడాల్సిన స్థితిని కల్పిస్తోంది. అయితే, క్రమంగా పునరుత్పాదక, హరిత ఇంధనాలపై పెట్టుబడులు పెరగడం హర్షణీయం. అయిదేళ్ల క్రితం శిలాజ ఇంధనాలపై ఒక డాలరు పెట్టుబడి పెడితే హరిత ఇంధనాలపై కూడా ఒక డాలరు పెట్టుబడి పెట్టేవారు. నేడు శిలాజ ఇంధనాలపై ఒక డాలరు పెట్టుబడి పెడితే హరిత ఇంధనాలపై 1.70 డాలర్లు పెట్టుబడి పెడుతున్నారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఇంధనంపై 2.8 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించనుండగా, అందులో 1.70 లక్షల కోట్ల డాలర్లను హరిత ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వ వంటి వసతులపై ఖర్చు చేయనున్నారు. కానీ, లక్ష కోట్ల డాలర్లపై చిలుకు పెట్టుబడులు చమురు, బొగ్గు, సహజవాయువులకు వెళతాయి. 2023లో రోజుకు 100 కోట్ల డాలర్లను సౌరశక్తిపై పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ఏడాది ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాలు 30 శాతానికి పైగా పెరగవచ్చునని ఐఈఏ నివేదిక తెలిపింది. హరిత ఇంధనాలపై పెడుతున్న కొత్త పెట్టుబడులలో 90 శాతం సంపన్న దేశాల నుంచి, చైనా నుంచే వస్తున్నాయి. వర్దమాన దేశాలు కూడా పునరుత్పాదక ఇంధనాలపై ఎక్కువ నిధులు వెచ్చించాలంటే సంపన్న దేశాలు 2009లోనే వాగ్దానం చేసిన 10,000 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని భారత్‌కు చెందిన ఇంధన నిపుణుడు విభూతి గర్గ్‌ పిలుపు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని