2030లో చంద్రుడిపైకి చైనా వ్యోమగాములు

చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి 2030లో తమ వ్యోమగాములను పంపనున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది.

Updated : 30 May 2023 12:54 IST

బీజింగ్‌: చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి 2030లో తమ వ్యోమగాములను పంపనున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అంతరిక్ష ప్రణాళికను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మంగళవారం ఉదయం 9.31 గంటలకు ఆ దేశం తన సొంత అంతరిక్ష కేంద్రానికి మూడో విడతగా ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. వారిలో ఇద్దరు వ్యోమగాములు జింగ్‌ హైపెంగ్‌, జూయాంగ్జూ, పౌర వ్యోమగామి గుయ్‌ హైచావో అయిదు నెలల వరకూ అక్కడ ఉండనున్నారు. వీరిని తీసుకెళ్లనున్న షెంజావో-16 వ్యోమనౌకను ప్రయోగించేందుకు ఇన్నర్‌ మంగోలియాలోని జ్యూకాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వద్ద ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి వెళ్లినవారంతా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. గుయ్‌ తొలి పౌర వ్యోమగామి. 

ఈ సందర్భంగా చైనా ‘మానవ సహిత అంతరిక్ష సంస్థ’ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ జికియాంగ్‌ మాట్లాడుతూ... ‘‘చైనా ఇటీవల మానవ సహిత చంద్రమండల అన్వేషణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2030 కల్లా జాబిలిపైకి మనిషిని పంపించడం, అక్కడ పరిశోధనలు, వాటికి సంబంధించిన ప్రయోగాలు చేయడమే మా లక్ష్యం’’ అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని