మాస్కోపై మళ్లీ అనూహ్య దాడి

ప్రపంచంలో అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ గల రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం జరిగిన ఊహించని డ్రోన్ల దాడితో ఆ దేశం ఉలిక్కిపడింది.

Published : 31 May 2023 04:03 IST

దెబ్బతిన్న పలు భవనాలు.. ఇద్దరికి గాయాలు
కీవ్‌పై బాంబుల వర్షం కురిపించిన రష్యా

కీవ్‌: ప్రపంచంలో అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ గల రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం జరిగిన ఊహించని డ్రోన్ల దాడితో ఆ దేశం ఉలిక్కిపడింది. దాడి కారణంగా స్వల్ప నష్టమే జరిగినప్పటికీ నివాస భవనాల నుంచి పెద్ద ఎత్తున పౌరులను తరలించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తరవాత రష్యా తన పౌరులను ఇలా సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ డ్రోన్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌కు అత్యంత సమీపం వరకూ దూసుకొచ్చాయని సమాచారం.  
మాస్కో మీదుగా వచ్చిన అయిదు డ్రోన్లను కూల్చేసినట్లు.. మరో మూడింటిని నిలువరించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. తెల్లవారుజామున జరిగిన ఈ దాడికి ఉక్రెయిన్‌ కారణమని ఆరోపించింది. తమపై జరిగిన దాడిని కీవ్‌ నిర్వహించిన ఉగ్రవాద దాడిగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అభివర్ణించారు. డ్రోన్ల దాడి కారణంగా పలు భవనాలు దెబ్బతిన్నట్లు మాస్కో మేయర్‌ సెర్గీ సోబియానిన్‌ ప్రకటించారు. ఇద్దరు పౌరులకు స్వల్ప గాయాలయ్యాయని.. వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డ్రోన్‌ దాడిలో దెబ్బతిన్న రెండు ఎత్తైన నివాస భవనాల నుంచి నివాసితులను రష్యా అధికారులు ఖాళీ చేయించారు. ఈ నెలలో మాస్కోపై డ్రోన్‌ దాడి జరగడం ఇది రెండోసారి.

మాస్కోపై డ్రోన్‌ల దాడి అనంతరం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రాత్రి నుంచి కొనసాగిన రష్యా భీకర దాడులను ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని.. అక్కడి అధికారులు చెప్పారు. అయితే ఈ దాడుల్లో కొన్ని భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. కీవ్‌ గగనతలంలో ప్రవేశించిన 20కిపైగా షాహెద్‌ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు సమాచారం. ఘటనలో హోలోసివ్‌ జిల్లాలోని ఒక భవంతిలో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారని అధికారులు వివరించారు.  


పుతిన్‌ను మా దేశంలో అరెస్టు చేయం: ద.ఆఫ్రికా

కేప్‌టౌన్‌: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) నుంచి అరెస్ట్‌ వారెంట్‌ను ఎదుర్కొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విషయంలో దక్షిణాఫ్రికా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పుతిన్‌ను అరెస్టు చేయకుండా దౌత్యపరమైన రక్షణ ఇచ్చింది. ఈ క్రమంలో పుతిన్‌తో పాటు ఆ దేశ ప్రతినిధులకు ఈ రక్షణ కల్పించింది. ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా అపహరించుకు పోయిందన్న ఆరోపణలపై మార్చిలో ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.  

వాస్తవానికి పుతిన్‌ తమ దేశం వస్తే ఐసీసీ సభ్య దేశంగా దక్షిణాఫికా ఆయన్ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి వ్యతిరేకంగా ఆ దేశం తాజా ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా భాగం. ఈ ఏడాది బ్రిక్స్‌ సదస్సులకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోంది. దీనిలో భాగంగా జూన్‌ 1-2 తేదీల్లో కేప్‌టౌన్‌లో బ్రిక్స్‌ మంత్రిత్వ స్థాయి సమావేశం జరగనుంది. ఆగస్టు 22-24 తేదీల్లో జొహన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్‌ సదస్సు జరగనుంది. దీనికి పుతిన్‌ హాజరయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని