మీ బాధను పంచుకుంటున్నాం.. భారత్‌కు అండగా ఉన్నాం

ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రిటన్‌, జపాన్‌ ప్రధాన మంత్రులు ఫుమియో కిషిదా, రిషి సునాక్‌ నుంచి ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు కోరోసి వరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Published : 04 Jun 2023 06:37 IST

రైలు ప్రమాదంపై ప్రపంచ నేతల సంతాపం

మాస్కో, టోక్యో: ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రిటన్‌, జపాన్‌ ప్రధాన మంత్రులు ఫుమియో కిషిదా, రిషి సునాక్‌ నుంచి ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు కోరోసి వరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


* రైలు ప్రమాదంతో ప్రభావితమైన వారి గురించే నా ప్రార్థనలు. ఒడిశాలో చోటుచేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ప్రాణాలతో బయటపడినవారికి, సహాయక చర్యల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వారికి నా ప్రశంసలు.

 రిషి సునాక్‌, బ్రిటన్‌ ప్రధాని


* రైలు ప్రమాదంలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంపై దిగ్భ్రాంతికి గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

షీ జిన్‌పింగ్‌, చైనా అధ్యక్షుడు


* ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జపాన్‌ ప్రభుత్వం, ప్రజల తరఫున సంతాపాన్ని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.

ఫుమియో కిషిదా, జపాన్‌ ప్రధాని


* రైలు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను మేం పంచుకుంటున్నాం. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.

 పుతిన్‌, రష్యా అధ్యక్షుడు


* ఒడిశా విషాద ఘటన దిగ్భ్రాంతికరం. ఉక్రెయిన్‌ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు బాధితుల కుటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.

 వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు.


* భారత్‌లో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు కలవరపరిచాయి.  తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో కెనడా పౌరులు భారత ప్రజలకు అండగా ఉన్నారు.    

 జస్టిన్‌ ట్రూడో, కెనడా ప్రధాని


* రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా.

 ప్రచండ, నేపాల్‌ ప్రధాని


* రైలు ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నా.

సాబా కొరోసీ, ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు


* భారత్‌లో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.

షెహబాజ్‌ షరీఫ్‌, పాకిస్థాన్‌ ప్రధాని


* రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి మోదీ, భారత ప్రజలకు నా ప్రగాఢ సంతాపం. ఫ్రాన్స్‌ మీకు సంఘాభావంగా నిలుస్తుంది.

 ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని