Long Covid: దీర్ఘకాలిక కొవిడ్‌తో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు

దీర్ఘకాల కొవిడ్‌ బాధితుల ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది.

Updated : 09 Jun 2023 09:26 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: దీర్ఘకాల కొవిడ్‌ బాధితుల ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ మేరకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ కేర్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐహెచ్‌ఆర్‌) జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలం కొవిడ్‌తో బాధపడిన 3,750 మంది రోగులపై యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌(యూసీఎల్‌), యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌కి చెందిన వైద్యులు పరిశోధనలు చేశారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత వారి ఆరోగ్యంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయన్న దానిపై ఈ వైద్యుల బృందం పరిశోధించింది. అలసట, నిరాశ, ఆందోళన, మెదడు చురుకుదనం తదితర అంశాలపై ప్రశ్నలకు దీర్ఘకాలిక కొవిడ్‌ బాధితుల నుంచి ఓ యాప్‌ ద్వారా సమాధానాలు రాబట్టారు. వీరిలో ఎక్కువ మంది అలసటతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇది ఎంతలా ఉందంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నాలుగో స్థాయిలో ఉన్నప్పుడు ఓ బాధితుడు ఎంతలా అలసటకు గురవుతాడో అంతకంటే.. ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. ‘‘బాధితుల జీవితాలపై దీర్ఘకాలిక కొవిడ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని మా అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రభావం వల్ల రోజువారీ కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ అని అధ్యయనానికి నాయకత్వం వహించిన డా. హెన్రీ గుడ్‌ఫెలో వెల్లడించారు. ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసిన వారిలో 90 శాతం మంది 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే. కొవిడ్‌ సోకిన తర్వాత మునుపటిలా పని చేయలేకపోతున్నామని అందులోని దాదాపు 51శాతం మంది పేర్కొన్నారు. 20 శాతం మంది పూర్తిగా పని చేయలేకపోతున్నామని చెప్పారు. మరోవైపు తమ వివరాలు పేర్కొన్న కొవిడ్‌ బాధితుల్లో 71శాతం మంది మహిళలే కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని