బలమైన బంధాల రూపశిల్పి జైశంకర్‌

భారత్‌-అమెరికాల మధ్య బలమైన సంబంధాలకు రూపశిల్పి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అని అమెరికా అభివర్ణించింది.

Published : 03 Oct 2023 04:08 IST

సేవల్ని ప్రశంసించిన అమెరికా

వాషింగ్టన్‌: భారత్‌-అమెరికాల మధ్య బలమైన సంబంధాలకు రూపశిల్పి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అని అమెరికా అభివర్ణించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి ఆయన ముఖ్య కారణమని పేర్కొంది. భారత రాయబార కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో డెమోక్రటిక్‌ పార్టీ సీనియర్‌ నేత రిచర్డ్‌ వర్మ మాట్లాడుతూ- రెండు దేశాల మధ్య కొత్త పుంతలు తొక్కుతున్న సంబంధాలకు జైశంకర్‌ ఆధునిక రూపకర్త అని కితాబిచ్చారు. శ్రమించే తత్వమున్న భారతీయ అమెరికన్లు రెండు దేశాల బంధానికి ప్రధాన కారణమని అన్నారు. ‘‘భారత్‌-అమెరికా మైత్రి ఈ దశాబ్దపు ముఖ్యమైన బంధాల్లో ఒకటి. ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అవి రోడ్డు ప్రయాణాల్లో ఎత్తుపల్లాల్లాంటివి. మహాత్మాగాంధీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ వంటి గొప్పవ్యక్తుల ఆలోచనలతో ఇరు దేశాలు సన్నిహిత మిత్రులుగా మారాయి. ఈ మైత్రి మరింత బలపడటానికి గతంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేసి, ప్రస్తుతం మంత్రిగా ఉన్న జైశంకర్‌ ముఖ్య కారణం’’ అని రిచర్డ్‌ వివరించారు. అయిదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న జైశంకర్‌.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌తో భేటీ అయ్యారు.
నీ అమెరికాలో రెండో పెద్ద నగరమైన లాస్‌ఏంజెలిస్‌లో భారతదేశ కాన్సులేట్‌ను తెరవాలని ఆ నగర మేయర్‌ కరెన్‌ బాస్‌ విజ్ఞప్తి చేశారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూకు ఈ మేరకు లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని