చైనాలో కొత్త సూర్యోదయం!
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంటే.. భానుడిలో శక్తిని ఉత్పత్తి చేసే సంక్లిష్ట ప్రక్రియను భూమిపై సాధించడం చుట్టూ చైనా తిరుగుతోంది. ‘కృత్రిమ సూర్యుడి’ని సాకారం చేసి భారీగా, పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుత్ను ఉత్పత్తి చేయాలని డ్రాగన్ ఉవ్విళ్లూరుతోంది.
కృత్రిమ భానుడి దిశగా ముందడుగు
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంటే.. భానుడిలో శక్తిని ఉత్పత్తి చేసే సంక్లిష్ట ప్రక్రియను భూమిపై సాధించడం చుట్టూ చైనా తిరుగుతోంది. ‘కృత్రిమ సూర్యుడి’ని సాకారం చేసి భారీగా, పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుత్ను ఉత్పత్తి చేయాలని డ్రాగన్ ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశగా ఇటీవల కీలక ముందడుగు వేసింది. 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రికార్డు స్థాయిలో 1,056 సెకన్ల పాటు రియాక్టర్ను పనిచేయించింది. ఇది సూర్యుడి కోర్ భాగంలోని ఉష్ణోగ్రత కన్నా ఐదు రెట్లు అధికం. (భానుడి కోర్ భాగంలో వేడి 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ మేర ఉంటుంది.) ఇంత సుదీర్ఘకాలం పాటు అధిక ఉష్ణోగ్రత ప్లాస్మా ఆపరేషన్ కొనసాగడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి.
ఏమిటీ యంత్రం?
ఈ కృత్రిమ సూర్యుడి పేరు ‘ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్’ (ఈస్ట్) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్. ఇది చైనాలోని హెఫెయ్ నగరంలో ఉంది. కేంద్రక సంలీన చర్యల (న్యూక్లియర్ ఫ్యూజన్) ద్వారా పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుత్ను ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం.
ఏమిటీ సంలీన చర్య?
కేంద్రక సంలీన చర్య.. విశ్వంలో ప్రధాన శక్తి వనరు. సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో జరిగే ప్రక్రియ ఇదే. మనం చూస్తున్న కాంతి, అనుభవిస్తున్న వేడి.. సూర్యుడి కేంద్ర భాగంలో జరుగుతున్న సంలీన చర్య ఫలితమే. కేంద్రక విచ్ఛిత్తి (న్యూక్లియర్ ఫిజన్) ప్రక్రియలో కేంద్రకాన్ని రెండుగా విడగొట్టడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తారు. సంలీన చర్యలో రెండు తేలికపాటి కేంద్రకాలను కలిపి ఒక భార కేంద్రకాన్ని వెలువరిస్తారు.
పనిచేసేది ఎలా?
* నక్షత్రాల్లో రెండు హైడ్రోజన్ కేంద్రకాలు విలీనమై, హీలియం కేంద్రకం ఏర్పడుతుంది. అదే రీతిలో హైడ్రోజన్ ఫ్యూజన్ను భూమిపై నియంత్రిత పద్ధతిలో సాధించాలని శాస్త్రవేత్తలు 70 ఏళ్లుగా కసరత్తు చేస్తున్నారు.
* ఇందుకోసం టోకామాక్ రియాక్టర్ను ఉపయోగిస్తున్నారు. ఇందులో హైడ్రోజన్ ఐసోటోపులైన డ్యూటీరియం, ట్రిటియంలను ఇంధనంగా వాడుతున్నారు. వీటి కేంద్రకాలు విలీనమయ్యే క్రమంలో హీలియం, భారీగా శక్తి వెలువడుతుంది. దీని సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
అంత సులువు కాదు..
డ్యూటీరియం, ట్రిటియంల కలయిక అంత సులువుగా జరగదు. నక్షత్రాల కోర్ భాగంలో అసాధారణ వేడి, పీడనం వద్ద మాత్రమే కేంద్రక సంలీన చర్య జరుగుతుంది. టోకామాక్ రియాక్టర్లలో వాటిని సృష్టించడం, కొనసాగించడం పెద్ద సవాలే.
* టోకామాక్లో హైడ్రోజన్ ఐసోటోపులను 150 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు, అపార పీడనానికి గురి చేయాలి. దీనివల్ల ప్లాస్మా ఏర్పడుతుంది.
* ఈ ప్లాస్మాను రియాక్టర్ చాంబర్లో శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాల సాయంతో అదుపులో ఉంచాలి. ఇది పొరపాటున రియాక్టర్ గోడలను తాకితే తన ఉష్ణాన్ని కోల్పోతుంది. ఈ ప్లాస్మా.. సంలీన చర్యకు వీలు కల్పిస్తుంది.
బోలెడు ప్రయోజనాలు
* ఈ శతాబ్దం చివరినాటికి ఇంధన డిమాండ్ మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. శిలాజ ఇంధనాల వల్ల భారీగా గ్రీన్హౌస్ వాయువులు వెలువడి, కాలుష్యం పెరుగుతోంది. ఈ సమస్యలకు కేంద్రక సంలీన చర్యల విధానంతో చెక్ పెట్టొచ్చు.
* బొగ్గు, గ్యాస్ వంటివి మండించడం ద్వారా జరిగే రసాయన చర్యతో పోలిస్తే కేంద్రక సంలీన చర్య వల్ల.. 40 లక్షల రెట్లు ఎక్కువ శక్తి వెలువడుతుంది. కేంద్రక విచ్ఛిత్తి చర్యలతో పోలిస్తే నాలుగు రెట్లు అధిక శక్తి విడుదలవుతుంది.
* సంలీన చర్యకు అవసరమైన ఇంధనాలు దాదాపు అపరిమితం. డ్యూటీరియం.. సముద్ర జలాల్లో విరివిగా దొరుకుతోంది. పుష్కలంగా లభ్యమవుతున్న లిథియం సాయంతో ట్రిటియంను ఉత్పత్తి చేయవచ్చు. వేల సంవత్సరాల ఉత్పత్తికి అవసరమైనంత ముడి సరకు భూమిపై ఉంది.
* సంలీన రియాక్టర్లలో అణు వ్యర్థాలు, కర్బన ఉద్గారాలు వెలువడవు.
భారత్ కూడా
కేంద్రక సంలీన రియాక్టర్తో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా భారత్ కూడా దానిపై దృష్టిసారించింది. 1989లో ‘ఆదిత్య’ పేరుతో ఒక టోకామాక్ను అభివృద్ధిచేసి, ప్రయోగాలు నిర్వహిస్తోంది.
* అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) పేరుతో అంతర్జాతీయంగా ఏర్పడిన భాగస్వామ్యంతోనూ భారత్ చేయి కలిపింది. ఈ రియాక్టర్ ఫ్రాన్స్లో సిద్ధమవుతోంది. ఇందులో చైనా, ఐరోపా సంఘం, జపాన్, కొరియా, రష్యా, అమెరికాలూ భాగస్వాములుగా ఉన్నాయి.
ఒక బాత్టబ్ పరిమాణంలోని నీటిలో ఉన్న డ్యూటీరియంను.. రెండు ల్యాప్టాప్ బ్యాటరీల్లోని లిథియం ద్వారా ఉత్పత్తి చేసే ట్రిటియంతో కలపడం ద్వారా ఒక వ్యక్తి జీవితకాలానికి సరిపడా పర్యావరణ అనుకూల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. ఇందులో వాడిన స్వల్ప స్థాయి ఇంధనం 230 టన్నుల బొగ్గుతో సమానం.
సూర్యుడిలో ప్రతి సెకనుకు 600 మిలియన్ టన్నుల హైడ్రోజన్ హీలియంగా మారిపోతుంది.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం