పుతిన్‌ యుద్ధ నేరస్థుడా?

ఉక్రెయిన్‌లో పౌర జనావాసాలపైన, ఆస్పత్రులు, ప్రసూతి వార్డులపైన బాంబులు కురిపిస్తున్న రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ యుద్ధ నేరస్థుడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దుయ్యబట్టారు. అయితే, ఎవరినైనా యుద్ధ నేరస్థుడిగా ధ్రువీకరించాలంటే, దానికి అంతర్జాతీయ స్థాయిలో కొన్ని నిర్వచనాలు, ప్రక్రియలు ఉన్నాయి. కేవలం మాటలతో ముద్ర వేస్తే సరిపోదు. అందులోనూ ఆయుధపరంగా శక్తిమంతమైన దేశ అధినేత పుతిన్‌ను పట్టుకొని, విచారించి, శిక్షించడం సాధ్యమయ్యే పనేనా?

Updated : 18 Mar 2022 05:18 IST

శక్తిమంతమైన దేశ అధినేతపై అభియోగాన్ని   నిర్ధరించి, శిక్షించడం సాధ్యమేనా!
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆరోపణ నేపథ్యంలో ఆసక్తిగా మారిన అంశం

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌లో పౌర జనావాసాలపైన, ఆస్పత్రులు, ప్రసూతి వార్డులపైన బాంబులు కురిపిస్తున్న రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ యుద్ధ నేరస్థుడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దుయ్యబట్టారు. అయితే, ఎవరినైనా యుద్ధ నేరస్థుడిగా ధ్రువీకరించాలంటే, దానికి అంతర్జాతీయ స్థాయిలో కొన్ని నిర్వచనాలు, ప్రక్రియలు ఉన్నాయి. కేవలం మాటలతో ముద్ర వేస్తే సరిపోదు. అందులోనూ ఆయుధపరంగా శక్తిమంతమైన దేశ అధినేత పుతిన్‌ను పట్టుకొని, విచారించి, శిక్షించడం సాధ్యమయ్యే పనేనా? అందుకే కాబోలు.. పుతిన్‌ గురించి బైడెన్‌ తన మనసులో ఉన్న మాటను వెల్లడించారు తప్ప యుద్ధ నేరస్థుడిగా నిర్ధరించే ప్రక్రియ పూర్తి కాలేదని శ్వేతసౌధం పత్రికా కార్యదర్శి జెన్‌ సాకీ వివరించారు. ‘పుతిన్‌ యుద్ధ నేరస్థుడనడంలో సందేహం లేదు. అయితే, బైడెన్‌ ఆయన విషయంలో రాజకీయ వ్యాఖ్య మాత్రమే చేశారు’ అని గతంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక కోర్టుకు ప్రధాన ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన డేవిడ్‌ క్రేన్‌ చెప్పారు. ఈ హోదాలో ఆయన సియేరా లియోన్‌ దేశంలో యుద్ధ నేరాలకు ఒడిగట్టిన లైబీరియా మాజీ అధ్యక్షుడు చార్లెస్‌ టేలర్‌పై విచారణ జరిపారు. మరోవైపు పుతిన్‌ యుద్ధ నేరాలపై ఇప్పటికే దర్యాప్తు మొదలైంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తీర్మానాన్ని అనుసరించి అమెరికా, మరో 44 దేశాలు ఉక్రెయిన్‌లో పుతిన్‌ చర్యలపై కలసికట్టు దర్యాప్తు ప్రారంభించాయి. నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు పుతిన్‌పై విడిగా దర్యాప్తు చేపట్టింది.

యుద్ధ నేరస్థుడంటే ఎవరు ?

సాయుధ సంఘర్షణ సమయంలో దేశాలు ఎలా ప్రవర్తించాలో నిర్దేశించే సూత్రాలను ప్రపంచ దేశాలు ఆమోదించాయి. రెండో ప్రపంచ యుద్దం తరవాత కుదిరిన జెనీవా ఒప్పందం, ఆ తరవాత అంగీకరించిన కొన్ని నియమాల ఆధారంగా రూపొందిన ఈ సూత్రాలు కాలానుగుణంగా మార్పుచెందుతూ వచ్చాయి. యుద్ధంలో పాల్గొనని పౌరులు, వైద్యులు, నర్సులు, గాయపడిన సైనికులు, యుద్ధ ఖైదీలకు ఈ సూత్రాలు రక్షణ కల్పిస్తున్నాయి. రసాయన, జీవాయుధాలను నిషేధిస్తున్నాయి. ఎవరి మీద ఏ ఆయుధాలతో దాడి చేయవచ్చునో నిర్దేశిస్తున్నాయి. ఈ సూత్రాలను ఉల్లంఘించే వారిని యుద్ధ నేరస్థులుగా ప్రకటిస్తారు.

యుద్ధ నేరాలంటే ఏమిటి?

సైనిక అవసరాల కోసం కాకుండా యథేచ్ఛగా ఊచకోతకు దిగడం, ఆస్తుల స్వాధీనం, విచ్చలవిడి విధ్వంసానికి పాల్పడటం వంటివి యుద్ధనేరాలుగా పరిగణన పొందుతాయి. బందీలను పట్టుకోవడం, పౌరులను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థి దళాలపై పోరాడటం, మితిమీరి బలప్రయోగం, పౌరులను విచక్షణారహితంగా చంపడం కూడా యుద్ధ నేరాలే. పౌరుల హత్య, మూకుమ్మడి జనహననం, అత్యాచారాలు, లైంగిక బానిసత్వం, చిత్రహింసలపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు దర్యాప్తు జరుపుతుంది. సైనికాధికారులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడాలని తన సైనికులను ఆదేశించినా, అలాంటి ఘాతుకాలు జరుగుతున్నట్లు తెలిసి కూడా నిరోధించకపోయినా వారు చట్టపరంగా శిక్షార్హులవుతారు. దీన్ని సేనానాయకత్వ బాధ్యత ఉల్లంఘనగా పరిగణిస్తారు. పుతిన్‌పై ఈ కోణం నుంచే విచారణ జరపాల్సి ఉంటుంది.

విచారణ జరిగేదెలా?

యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ద్వారా విచారణ జరపడం ఒక పద్ధతి. పుతిన్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయడం రెండో పద్ధతి. అమెరికా, నాటో, ఐరోపా సమాఖ్య (ఈయూ)లు పుతిన్‌పై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని కానీ, ట్రైబ్యునల్‌ను కానీ నియమించడం మూడో పద్ధతి. కొన్ని దేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల ఆధారంగా యుద్ధనేరాలపై విచారణ చేపట్టడం నాలుగో పద్ధతి. జర్మనీలో ఈ తరహా చట్టం ఉంది. దాని కింద ఇప్పటికే పుతిన్‌పై విచారణ ప్రారంభించింది. అమెరికాలో అటువంటి చట్టం లేకపోయినా, ఆ దేశ న్యాయ శాఖలో ఉన్న ఒక ప్రత్యేక విభాగం అంతర్జాతీయ జన హత్యలు, చిత్రహింసలు, బాలసైనికుల నియామకాలు, మహిళల జననాంగాలను ఛిద్రం చేయడం వంటి నేరాలపై విచారణ జరుపుతుంది.

పుతిన్‌ను ఎక్కడ విచారించాలి?

నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును రష్యా గుర్తించడం లేదు. అమెరికా కూడా ఈ కోర్టు విచారణ పరిధిని ఆమోదించడం లేదు. కాబట్టి ఐక్యరాజ్యసమితి కానీ, కొన్ని దేశాల సంఘం కానీ నిర్దేశించిన దేశంలో పుతిన్‌పై విచారణ జరపవచ్చు. కానీ, పుతిన్‌ను అక్కడకు తీసుకెళ్లడం అసాధ్యం.


గతంలో ఏ దేశాల నాయకులను శిక్షించారు?

రెండో ప్రపంచ యుద్ధం తరవాత నాజీ జర్మనీ, జపాన్‌ నాయకులను న్యూరెంబర్గ్‌, టోక్యో ట్రైబ్యునళ్లలో విచారించి శిక్షించారు. తరవాత బోస్నియా, రువాండా, కాంబోడియా దేశాల సీనియర్‌ నాయకులనూ తాత్కాలిక ట్రైబ్యునళ్లలో విచారించారు. 1990లలో యుగోస్లావియా ముక్కచెక్కలైనప్పుడు రక్తపాతం సృష్టించిన స్లొబోదాన్‌ మిలోసెవిచ్‌ను నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఐక్యరాజ్యసమితి ట్రైబ్యునల్‌ విచారించింది. తీర్పు వెలువడేలోపే ఆయన జైలు గదిలో మరణించారు. మిలోసెవిచ్‌ మిత్రులైన రాడోవాన్‌ కరాడ్జిచ్‌, జనరల్‌ రాట్కో మ్లాడిచ్‌లను విచారించి జైలు శిక్షలు విధించారు.

పొరుగుదేశం సియేరా లియోన్‌లో అత్యాచారాలను ప్రేరేపించిన లైబీరియా దేశాధ్యక్షుడు టేలర్‌కు 50 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. మానవాళిపై ఘాతుకాలకు పాల్పడినందుకు చాడ్‌ దేశ మాజీ నియంత హిస్సేనీ హాబ్రేకి ఒక ఆఫ్రికా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని