
Ukraine Crisis: ఆయుధాలు ఆపకుంటే తీవ్ర పర్యవసానాలు
అమెరికాను హెచ్చరించిన రష్యా
కీవ్పై మరోసారి ముప్పేట దాడి
ఆయుధ కర్మాగారాల ధ్వంసం
పలు నగరాలపై క్షిపణుల వర్షం
బ్రిటన్ ప్రధాని, కేబినెట్ మంత్రులపై పుతిన్ నిషేధం
కీవ్, మాస్కో: ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను అమెరికా ఆపని పక్షంలో ‘తీవ్ర పర్యవసానాలు’ ఉంటాయని రష్యా గట్టి హెచ్చరిక చేసింది. ఉక్రెయిన్కు భారీగా జావెలిన్ వంటి క్షిపణుల్ని సరఫరా చేయడంతో పాటు మరో 80 కోట్ల డాలర్ల విలువైన అధునాతన ఆయుధాలు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రష్యా మండిపడింది. ఆయుధాలు పంపడాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని దౌత్య వర్గాల ద్వారా ఒక నోట్ను బైడెన్ ప్రభుత్వానికి పంపింది. ‘‘బాధ్యతారహితంగా ఉక్రెయిన్ సైన్యానికి పశ్చిమదేశాలు సహకారాన్ని అందిస్తున్నాయి’’ అని ఆక్షేపించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్పైనా, కేబినెట్ మంత్రులు- రిషి సునాక్, లిజ్ ట్రుస్, ప్రీతి పటేల్, మాజీ ప్రధాని థెరిసా మే సహా ఆ దేశానికి చెందిన 13 మంది ఉన్నతస్థాయి వ్యక్తులపైనా నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.
క్షిపణులతో రష్యా విధ్వంసం
మరోవైపు.. ఉక్రెయిన్పై రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేసింది. కీవ్ నగరం లక్ష్యంగా విరుచుకుపడింది. ఆ నగరంలో సాయుధ వాహనాలు తయారు చేసే కర్మాగారం భవనాలను, మైకొలైవ్లో సైనిక వాహనాల మరమ్మతుల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. దీని కోసం అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించింది. కీవ్తో పాటు లివివ్ నగరంపై వాయుసేన విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఖర్కివ్, లుహాన్స్క్, దొనెట్స్క్ సహా తూర్పు ప్రాంతాలపై ఫిరంగుల మోత మోగింది. తమ యుద్ధనౌకకు నష్టం కలిగినందుకు మరింత ప్రతీకారంతో దాడుల స్థాయి పెంచింది. బెలారస్ నుంచి బయల్దేరిన రష్యా యుద్ధ విమానాలు క్రూయిజ్ క్షిపణుల్ని ప్రయోగించగా వాటిలో నాలుగింటిని తాము కూల్చివేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మేరియుపొల్లో పలుచోట్ల హోరాహోరీ పోరు కొనసాగింది. పెద్దఎత్తున మృతదేహాలను పూడ్చివేసిన దృశ్యాలు కనిపించాయి. ఖర్కివ్లో ఒక భవనంపై జరిగిన దాడిలో ఏడు నెలల పసి పాపాయి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
అణ్వాయుధాలు వాడతారేమో: జెలెన్స్కీ
తమపై రష్యా అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందని, ప్రపంచ దేశాలన్నీ దీనికి సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలంటే పుతిన్కు లెక్కలేదనీ, అందుకే రసాయన ఆయుధాలనైనా తమపై ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు. ఉక్రెయిన్ను సులభంగా చేజిక్కించుకోవచ్చనే తప్పుడు అంచనాల్లో శత్రువులు ఉన్నారని వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. తమ దేశం ఎప్పటికీ రష్యా చేతికి చిక్కదని తేల్చిచెప్పారు. రష్యాపై మరింతగా కొరడా ఝళిపించి, అక్కడి నుంచి ఇంధన దిగుమతుల్ని పూర్తిగా నిషేధించాలని ప్రపంచాన్ని కోరారు. వచ్చేవారం జరగనున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు సమావేశాలకు ఉక్రెయిన్ తన ప్రతినిధి బృందాన్ని పంపించనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే
- Andhra News: కాటేసిన కరెంటు
- ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- BJP: అంబర్పేట్లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం