Ukraine Crisis: మేరియుపొల్‌ నుంచి తరలింపులు

ఉక్రెయిన్‌లో తీర నగరమైన మేరియుపొల్‌ నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పని ఎట్టకేలకు మొదలైంది. అక్కడి సువిశాల అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణ భూగర్భంలో సైనికులతో పాటు సాధారణ ప్రజలు తలదాచుకోవడం, ఆ ప్రాంతాన్ని ఎలాగైనా ధ్వంసం చేసి నియంత్రణ సాధించాలని రష్యా ప్రయత్నిస్తుండడం తెలిసిందే. ఐరాస, అమెరికా వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకురావడంతో ఆదివారం ముందుగా 19 మంది మహిళల్ని, ఆరుగురు పిల్లల్ని ఆ ప్రాంగణం నుంచి ఖాళీ చేయించగలిగారు.

Updated : 02 May 2022 06:08 IST

మహిళలు, పిల్లలకు తొలి ప్రాధాన్యం
రష్యా సైనికులు పోరాటం వీడాలని ఉక్రెయిన్‌ పిలుపు
కీవ్‌ను సందర్శించిన నాన్సీ పెలోసీ.. జెలెన్‌స్కీకి కితాబు

ఖర్కివ్‌: ఉక్రెయిన్‌లో తీర నగరమైన మేరియుపొల్‌ నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పని ఎట్టకేలకు మొదలైంది. అక్కడి సువిశాల అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణ భూగర్భంలో సైనికులతో పాటు సాధారణ ప్రజలు తలదాచుకోవడం, ఆ ప్రాంతాన్ని ఎలాగైనా ధ్వంసం చేసి నియంత్రణ సాధించాలని రష్యా ప్రయత్నిస్తుండడం తెలిసిందే. ఐరాస, అమెరికా వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకురావడంతో ఆదివారం ముందుగా 19 మంది మహిళల్ని, ఆరుగురు పిల్లల్ని ఆ ప్రాంగణం నుంచి ఖాళీ చేయించగలిగారు. బాంబు శబ్దాల మధ్య వారి వాహనాలు ముందుకు కదిలాయి. అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సాయంతో తరలింపు మొదలైనట్లు ఐరాస ధ్రువీకరించింది. నీరు, ఆహారం, మందుల కోసం అలమటిస్తూ కొన్ని వందల మంది ఇంకా అజోవ్‌స్తల్‌లోనే ఉన్నారు. కనీసం వెయ్యి మందిని ముందుగా అక్కడి నుంచి ఖాళీ చేయించాలని ఐరాస లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ, తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలపై పట్టు సాధించడానికి రష్యా సేనలు అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉక్కు కర్మాగార ప్రాంగణంలో ఉన్న కొందరు తీవ్ర గాయాలతో బాధ పడుతుండగా, చికిత్స అందని కారణంగా మరికొందరిలో శరీర భాగాలు కుళ్లి మరింత సమస్య ఎదురవుతున్నట్లు తాజా వీడియో దృశ్యాల్లో బయటపడింది. లొంగిపోయేందుకు అక్కడి సైనికులు ససేమిరా అంటున్నారు.

మరోసారి అగ్రరాజ్యం భరోసా
ఉక్రెయిన్‌కు కావాల్సిన సాయాన్ని అన్ని విధాలా అందిస్తామని అమెరికా మరోసారి భరోసా ఇచ్చింది. ఆ దేశ దిగువసభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆకస్మిక పర్యటనలో భాగంగా జెలెన్‌స్కీతో భేటీ అయి ఈ మేరకు హామీ ఇచ్చారు. శనివారం ఆమె కీవ్‌కు వచ్చారు. ఆదివారం పోలండ్‌లో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రాన్ని కాపాడుకునే పోరులో జెలెన్‌స్కీ అందిస్తున్న నాయకత్వానికి అమెరికా ప్రజల తరఫున కితాబునిచ్చినట్లు చెప్పారు.

ఖేర్సన్‌లో రూబుల్‌ వినియోగానికి ఒత్తిడి
దక్షిణ ఉక్రెయిన్‌ నగరమైన ఖేర్సన్‌లో ఆదివారం నుంచి రష్యా కరెన్సీ అయిన రూబుల్‌ను వాడాలని ప్రయత్నం జరిగినా దానిని ప్రజలు వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ మాత్రమే ఉందని అధికార వర్గాలూ తెలిపాయి. ఒడెసాలోని విమానాశ్రయ రన్‌వేపై తాము వినియోగించింది ఓనిక్స్‌ క్షిపణులు అని రష్యా ప్రకటించింది. అమెరికా, ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన ఆయుధాలు లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు వెల్లడించింది.

నాటో విన్యాసాలు మొదలు
వార్సా: సభ్య దేశాల భద్రత లక్ష్యంగా నాటో సైనిక బలగాలు ఆదివారం పోలండ్‌లో విన్యాసాలు ప్రారంభించాయి. దీనిలో ఇరవై దేశాలకు చెందిన దాదాపు 18,000 మంది సైనికులు పాలుపంచుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటి చిత్రాలను బహిర్గతం చేయకూడదని పోలండ్‌ సైన్యం నిర్ణయించింది.


రష్యా సైనికులూ! ప్రాణాలు కాపాడుకోండి: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒక వీడియో సందేశం వెలువరించారు. పోరులో కొన్ని వేలమంది సైనికులు ప్రాణాలు కోల్పోతారని రష్యా సైనిక జనరళ్లే అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా తమపై పోరాటాన్ని ఆపి, ప్రాణాలు కాపాడుకోవాలని రష్యా సైనికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం అనుభవం లేనివారిని కొత్తగా నియమించుకుని రణక్షేత్రంలోకి పంపేందుకు రష్యా ప్రయత్నిస్తోందని, వారు ఉక్రెయిన్‌కు వచ్చి ప్రాణాలు కోల్పోయే బదులు రష్యాలో ఉండడమే మేలని సూచించారు. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో కొన్ని వేల టన్నుల ఆహారధాన్యాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నారని తాజాగా బయటపడింది. రెండు దేశాల మధ్య ప్రతిరోజూ మాటలైతే కొనసాగుతున్నా దీనిలో పురోగతి సాధించడం అంత సులభం కాదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌ ఒక ముఖాముఖిలో వ్యాఖ్యానించారు.


రష్యా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌కు గాయాలు!

మాస్కో: ఉక్రెయిన్‌ యుద్ధంలో వేగం సాధించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాలతో కార్యక్షేత్రంలోకి దిగిన రష్యా సైన్యం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వాలెరీ గెరసిమోవ్‌ కాలుకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని అక్కడి నుంచి రష్యాకు తరలించినట్లు రష్యా అంతర్గత వ్యవహారాల మాజీ మంత్రి ఒకరు తెలిపారు. ఖర్కివ్‌ ప్రాంతంలో వాలెరీ ఉన్నప్పుడు పదునైన తునకలు దూసుకువచ్చి ఈ గాయాలకు కారణమయ్యాయని సమాచారం. కుడి కాలుకు గాయాలయ్యాయనీ, ఎముక మాత్రం విరగలేదని అనధికార వర్గాల కథనం. చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌కు ప్రాణాపాయం తప్పినా, మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ని తిరిగి రష్యాకు తరలించాల్సి రావడం పుతిన్‌ సేనలకు ఇబ్బందికర పరిణామమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు