వాలంటీర్లుగా చేరం.. జైల్లోనే ఉంటాం..!

జైలు నుంచి విడుదల చేస్తామంటే ఎవరైనా సంతోషపడతారు. రష్యాలో ఖైదీలు మాత్రం బిక్కుబిక్కుమంటున్నారు. మాకొద్దు ఈ క్షమాభిక్ష అంటున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం జోరుగా సాగుతోంది. రెండు మూడు నెలల్లో ఉక్రెయిన్‌

Published : 12 Aug 2022 06:36 IST

విడుదల చేస్తామన్నా.. వద్దంటున్న రష్యా ఖైదీలు
క్షమాభిక్ష పథకానికి కరవైన స్పందన

మాస్కో: జైలు నుంచి విడుదల చేస్తామంటే ఎవరైనా సంతోషపడతారు. రష్యాలో ఖైదీలు మాత్రం బిక్కుబిక్కుమంటున్నారు. మాకొద్దు ఈ క్షమాభిక్ష అంటున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం జోరుగా సాగుతోంది. రెండు మూడు నెలల్లో ఉక్రెయిన్‌ లొంగిపోతుందని తొలుత మాస్కో భావించింది. ఆరు నెలలైనా ఆ దేశం తల వంచకపోవడంతో ఇంకెంత కాలం యుద్ధం కొనసాగుతుందో తెలియని పరిస్థితి. దీంతో ఉక్రెయిన్‌లో యుద్ధం చేసేందుకు వాలంటీర్ల కోసం రష్యా భారీస్థాయిలో దేశవ్యాప్తంగా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ దేశ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. వాలంటీర్లుగా చేరే ఖైదీల శిక్షలు రద్దు చేస్తామని ప్రకటించింది. దీంతో భారీస్థాయిలో నేరస్థులు.. వాలంటీర్లుగా చేరుతారని రష్యా ఊహించింది. కానీ స్పందన అంతగా రాలేదు. ఇలా ఖైదీలను రష్యా వాడుకోవడం కొత్తేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధంలోనూ ఈ పద్ధతిని అనుసరించింది. ఇప్పటివరకు కేవలం 1500 మంది ఖైదీలు మాత్రమే ఈ క్షమాభిక్ష పథకానికి దరఖాస్తు చేశారు. చేరడానికి చాలామంది విముఖత కనబరుస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇటీవల సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ పీనల్‌ కాలనీ  కారాగారం నుంచి వెళ్లిన 11 మంది వాలంటీర్లలో 8 మంది ఉక్రెయిన్‌ యుద్ధంలో చనిపోయారు. దీంతో బతికుంటే బలుసాకు తినొచ్చని జైలులోనే ఉండేందుకు రష్యా ఖైదీలు మొగ్గుచూపుతున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని