అనావృష్టితో చైనా అతలాకుతలం

అసలే కొవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన చైనాకు గోరుచుట్టుపై రోకటిపోటులా తీవ్ర అనావృష్టి వచ్చిపడింది. వర్షాలు ముఖం చాటేయడంతో వేసవి ఎండలు మండిపోతున్నాయి. చైనాలో వర్షపాతం గడచిన 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత అతి తక్కువ

Published : 20 Aug 2022 04:41 IST

1961 తర్వాత తొలిసారి తీవ్ర ఎండలు
నదులు అడుగంటి, నిలిచిన జల విద్యుదుత్పత్తి

బీజింగ్‌: అసలే కొవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన చైనాకు గోరుచుట్టుపై రోకటిపోటులా తీవ్ర అనావృష్టి వచ్చిపడింది. వర్షాలు ముఖం చాటేయడంతో వేసవి ఎండలు మండిపోతున్నాయి. చైనాలో వర్షపాతం గడచిన 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత అతి తక్కువ స్థాయికి పడిపోయింది. ఆసియాలోని అతిపెద్ద నదుల్లో ఒకటైన యాంగ్జే సగానికి సగం చిక్కిపోయింది. అనావృష్టితో నదులు ఎండిపోవడం జలవిద్యుదుత్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. కర్మాగారాలకు కరెంటు సరఫరా నిలిచిపోయి, పారిశ్రామికోత్పత్తి దెబ్బతింటోంది. తాగునీటికి, సాగునీటికి కటకట ఏర్పడింది. 2022లో 5.5% వృద్ధిరేటును సాధించాలనుకున్న డ్రాగన్‌.. ఈ ఏడాది ప్రథమార్ధంలో అందులో సగం రేటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పరిశ్రమలు, ఇళ్లకు కరెంటు కోతలు

చైనాలో మూడో పెద్ద రాష్ట్రమైన సిచువాన్‌లో 80% కరెంటు వాడకానికి జలవిద్యుత్తే ఆధారం. వర్షాభావం వల్ల ఇక్కడున్న 51 చిన్న నదులు, 24 రిజర్వాయర్లు ఎండిపోయాయి. ఫలితంగా కరెంటు కొరత ఏర్పడి సిచువాన్‌, చోంగ్‌ కింగ్‌లలో సౌరఫలకాలు, ప్రాసెసర్‌ చిప్‌లు, ఆటో విడిభాగాలు తయారుచేసే వేల కర్మాగారాలను ఆరు రోజులపాటు మూసివేశారు. షాపింగ్‌ మాల్స్‌, కార్యాలయాలు, ఇళ్లకు కరెంటు కోతలు విధించారు. షాంఘై నగరంలో టెస్లాతోపాటు ఓ పెద్ద చైనా కార్ల కంపెనీ ఉత్పత్తిని నిలిపివేశాయి. థర్మల్‌ విద్యుత్‌పై ఆధారపడిన ఇతర రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్టు అధికారులు తెలిపారు.

కృత్రిమ వర్షాలే శరణ్యం

అనావృష్టిని అధిగమించేందుకు యాంగ్జే తీరాన సిల్వర్‌ అయొడైడ్‌ రాడ్ల సాయంతో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 19 రాష్ట్రాలున్న యాంగ్జే పరీవాహక ప్రాంతం... దేశ జీడీపీలో 45 శాతానికి దోహదం చేస్తోంది. పలు ఇతర నదులు, కాలువల్లోనూ సరకు రవాణా బాగా తగ్గిపోయింది.

ఉష్ణ ప్రభంజనం

చైనాలో ఉష్ణ ప్రభంజనం మొదలై రెండు నెలలు దాటింది. 1961 తరవాత ఇంతటి ప్రచండమైన ఎండలు నమోదవుతుండటం ఇదే తొలిసారి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇప్పటికే 138 నగరాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా, బుధవారం మరో 373 నగరాల్లో ఆరంజ్‌ అలర్ట్‌ విధించారు. 262 వాతావరణ కేంద్రాల్లో 40 డిగ్రీలకుపైగా, 8 చోట్ల 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 27 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఏసీలు వాడకూడదని సిచువాన్‌ రాజధాని చెంగ్డూలో అధికారులు ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని