ఉక్రెయిన్‌ భూభాగాల విలీనం నేడే

‘ప్రజాభిప్రాయ సేకరణ’ ద్వారా ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము విలీనం చేసుకుంటున్నట్లు రష్యా గురువారం అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం క్రెమ్లిన్‌లో దీనికోసం నిర్వహించే కార్యక్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పాల్గొంటారని

Published : 30 Sep 2022 04:31 IST

అధికారికంగా ప్రకటించిన రష్యా ప్రభుత్వం

కీవ్‌: ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ద్వారా ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము విలీనం చేసుకుంటున్నట్లు రష్యా గురువారం అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం క్రెమ్లిన్‌లో దీనికోసం నిర్వహించే కార్యక్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పాల్గొంటారని, ఆయా ప్రాంతాలకు చెందిన మాస్కో అనుకూల పరిపాలకులు సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేస్తారని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. రెఫరెండంపై ఉక్రెయిన్‌ సహా వివిధ దేశాల్లో అభ్యంతరాలైతే ఉన్నప్పటికీ విలీన ఏర్పాట్లు మాత్రం చకచకా జరుగుతున్నాయి. ‘జాతీయ భద్రత, రక్షణ మండలి’ అత్యవసర సమావేశాన్ని శుక్రవారమే నిర్వహించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిర్ణయించారు. రష్యా ఎత్తుగడలపై దీనిలో చర్చించనున్నారు. జపోరిజియా, ఖేర్సన్‌, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలు రష్యాలో విలీనానికి అంగీకారం తెలిపాయని పుతిన్‌ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. లిమాన్‌ నగరం సమీపంలోని పలు గ్రామాలను ఉక్రెయిన్‌ బలగాలు స్వాధీనం చేసుకున్నాయనీ, త్వరలోనే ఆ నగరం మొత్తాన్ని అవి చుట్టుముట్టబోతున్నాయని ‘యుద్ధ అధ్యయన సంస్థ’ తెలిపింది.


ఆంక్షలు సరిపోవు

అమెరికా సెనేట్‌ కమిటీ

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అమెరికా సెనేట్‌ విదేశీ వ్యవహారాల కమిటీకి ఆ దేశ ఆర్థిక, విదేశాంగ శాఖల అధికారులు సూచించారు. ఆశించిన స్థాయిలో తొలివిడత ఆంక్షల దెబ్బ రష్యాకు తగల్లేదని వారు పేర్కొన్నారు.


రష్యా పర్యాటకులపై ఫిన్లాండ్‌ నిషేధం

హెల్సింకీ: పర్యాటక వీసాలపై రష్యా నుంచి వచ్చేవారిని నిషేధిస్తున్నట్లు ఫిన్లాండ్‌ ప్రకటించింది. రష్యా నుంచి నిరంతరం వస్తున్న పర్యాటకుల కారణంగా తమ  అంతర్జాతీయ సంబంధాలు ప్రమాదంలో పడుతున్నందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, శుక్రవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ఫిన్లాండ్‌ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్తో విలేకరులకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని