14న ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద మహాత్ముని ప్రతిమ ఆవిష్కరణ

వచ్చేనెలలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ ప్రతిమను ఆవిష్కరించనున్నారు.

Updated : 28 Nov 2022 05:33 IST

ఐరాస: వచ్చేనెలలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ ప్రతిమను ఆవిష్కరించనున్నారు. ఐరాస భద్రతామండలికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ భారత శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్‌ సుతార్‌ దీన్ని రూపొందించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహానికి రూపకల్పన చేసింది కూడా ఆయనే. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఐరాస పర్యటనకు వస్తున్న నేపథ్యంలో డిసెంబరు 14న గాంధీజీ ప్రతిమను ఆవిష్కరించనున్నారు. ఐరాస ప్రధాన కార్యాలయానికి (న్యూయార్క్‌) చెందిన ప్రతిష్ఠాత్మక ఉత్తర ప్రాంగణంలో మహాత్ముని ప్రతిమను ఏర్పాటు చేస్తున్నట్లు ఐరాస రాయబార కార్యాలయం భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ ‘పీటీఐ’కి తెలిపారు. ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద గాంధీజీ ప్రతిమను తొలిసారిగా ఏర్పాటు చేస్తుండగా.. ఇది భారత్‌ నుంచి అందిన బహుమతి. ప్రపంచ దేశాల నుంచి అందే ఇలాంటి బహుమతులు, కళాకృతులను ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తుంటారు. ఇంతవరకు భారత్‌ 1982 జులై 26న అందించిన సూర్య భగవానుడి (11వ శతాబ్దపు నల్లరాతి) విగ్రహం మాత్రమే ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. గాంధీజీ ప్రతిమ ఆవిష్కార కార్యక్రమానికి భద్రతామండలికి చెందిన 15 సభ్యదేశాలూ హాజరయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని