ఆరు నెలల్లో మనిషి మెదడులో చిప్!
మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే సాంకేతికతకు సంబంధించి న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు.
న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
పుర్రెలో అమర్చే రోబో ప్రదర్శన
కాలిఫోర్నియా: మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే సాంకేతికతకు సంబంధించి న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్’ (బీసీఐ) సాంకేతికతను మరో ఆరు నెలల్లో మానవులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్లో ఉన్న న్యూరాలింక్ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మనిషి మెదడులో పెట్టబోయే చిప్తో పాటు దాన్ని పుర్రెలో అమర్చగలిగే రోబోను కూడా పరిచయం చేశారు. మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు అవసరమైన అనుమతుల కోసం అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ)’కు సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. పక్షవాతం వచ్చినవారిలో దెబ్బతిన్న అవయవాలను కదిలించగలిగేలా చేసేందుకు వెన్నుపూసలో అమర్చేందుకు ఓ చిప్ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. చూపు కోల్పోయిన వారికి సైతం సాయపడేలా మరో పరికరాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎఫ్డీఏతో జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయన్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా మెదడులో చిప్ అమర్చిన ఓ వానరం ఎలా వ్యవహరిస్తుందో ఈ సమావేశంలో న్యూరాలింక్ ప్రదర్శించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.