సంక్షిప్త వార్తలు(4)
వాతావరణ మార్పులు, భూసార క్షయం, జీవవైవిధ్య నష్టాలను అరికట్టాలంటే ప్రకృతి ఆధారిత పరిష్కారాల (ఎన్బీఎస్) కోసం వెచ్చించే నిధులను 2025కల్లా రెట్టింపు చేయాలని ఐక్యరాజ్య సమితి పర్యావరణ రక్షణ సంస్థ (యూఎన్ఈపీ) నూతన నివేదిక సిఫార్సు చేసింది.
జీవవైవిధ్య రక్షణకు అదనపు పెట్టుబడులు కావాలి
జెనీవా: వాతావరణ మార్పులు, భూసార క్షయం, జీవవైవిధ్య నష్టాలను అరికట్టాలంటే ప్రకృతి ఆధారిత పరిష్కారాల (ఎన్బీఎస్) కోసం వెచ్చించే నిధులను 2025కల్లా రెట్టింపు చేయాలని ఐక్యరాజ్య సమితి పర్యావరణ రక్షణ సంస్థ (యూఎన్ఈపీ) నూతన నివేదిక సిఫార్సు చేసింది. ‘‘2025 కల్లా ఎన్బీఎస్లపై ఏటా 38,400 కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం. ప్రస్తుతం 15,400 కోట్ల డాలర్లనే పెట్టుబడి పెడుతున్నారు. 2030 కల్లా వార్షిక పెట్టుబడులు 48,400 కోట్ల డాలర్లకు చేరాల్సి ఉంది. ఇప్పుడు వాస్తవంగా కేటాయిస్తున్నది దీనిలో మూడో వంతు మాత్రమే. 2050 కల్లా కర్బన ఉద్గారాలు నెట్ జీరోకు చేరాలంటే ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టాలి’’ అని యూఎన్ఈపీ పిలుపు ఇచ్చింది.
ముగింపు దశకు ఆర్టెమిస్-1 యాత్ర
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా ప్రయోగించిన ఒరాయన్ వ్యోమనౌక భూమిపైకి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. ఈ నెల 11న అది పుడమిని చేరుకుంటుంది. ఈ క్రమంలో అది గంటకు 39,400 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు భూమిపైకి తిరిగొచ్చే వేగం కన్నా ఇది చాలా అధికం. దానివల్ల ఉత్పన్నమయ్యే వేడిని ఒరాయన్ ఉష్ణ కవచాలు ఎంతమేర తట్టుకోగలవన్నది నిపుణులు పరీక్షించనున్నారు. ఆర్టెమిస్-1 ప్రాజెక్టులో భాగంగా నవంబరు 16న ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. తిరుగు ప్రయాణానికి ముందు 10 చిన్న ఉపగ్రహాలను ఒరాయన్ విడుదల చేయనుంది. అవి చంద్రుడి దక్షిణ ధ్రువంపై మంచును గుర్తించడం వంటి కార్యకలాపాలు నిర్వర్తించనున్నాయి. భవిష్యత్తులో జరిగే ఆర్టెమిస్ యాత్రల్లో మనుషులు అక్కడే కాలుమోపనున్నారు.
స్నేహితుడు మోదీకి పూర్తి మద్దతు ఇస్తాం
భారత్ జి-20 సారథ్యంపై బైడెన్
వాషింగ్టన్: భారత్... అమెరికాకు బలమైన భాగస్వామి అని అగ్రరాజ్యాధినేత జో బైడెన్ పేర్కొన్నారు. గురువారం భారత్ లాంఛనంగా జి-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బైడెన్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తన స్నేహితుడని అన్నారు. ‘‘అమెరికాకు భారత్ బలమైన భాగస్వామి. నా మిత్రుడు మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో జి-20 సారథ్యం వహిస్తున్న భారత్కు పూర్తి మద్దతు ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాను’’ అని తెలిపారు.
ఐరాస భవనంలో మహాత్మాగాంధీ ప్రతిమ
ఈ నెల 14న ప్రారంభించనున్న గుటెస్, జైశంకర్
ఐరాస: ఐక్యరాజ్య సమితిలో మహాత్మాగాంధీ ప్రతిమను ఈ నెల 14వ తేదీన ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, భారత విదేశీవ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ ఆవిష్కరించనున్నారు. శక్తిమంతమైన 15 దేశాల భద్రతా మండలికి భారత్ అధ్యక్షత వహిస్తున్నప్పుడే ఇది ఏర్పాటుకావడం విశేషం. ఐరాస భవనంలోని ప్రతిష్ఠాత్మకమైన నార్త్ లాన్లో తొలిసారిగా ఈ ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. ‘‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’’ రూపకల్పన చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ మహాత్మాగాంధీ ప్రతిమను తయారు చేస్తున్నారు. వంతుల వారీగా నిర్వహించే భద్రతామండలి అధ్యక్ష బాధ్యతలను గురువారం భారత్ చేపట్టింది. న్యూయార్క్లోని ఐరాసకి భారతదేశపు మొదటి మహిళా శాశ్వత ప్రతినిధి అయిన రుచిరా కాంబోజ్ శక్తిమంతమైన ఈ అధ్యక్ష స్థానంలో కూర్చొన్నారు. భద్రతా మండలిలో రెండేళ్ల భారత సభ్యత్వం ఈ నెల 31తో ముగుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి