Hamsters: కొవిడ్‌ కలకలం.. హాంకాంగ్‌లో హ్యామ్‌స్టర్‌లను చంపాలని నిర్ణయం

చైనా పాలనలోని హాంకాంగ్‌ సైతం కరోనా కట్టడికి కఠిన నిబంధనలు పాటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇక్కడి ఓ పెంపుడు జంతువుల దుకాణంలో మహమ్మారి కలకలం రేగింది. ఇందులో పనిచేసే వ్యక్తికి డెల్టా వేరియంట్‌ సోకి, అది ఇతరులకూ వ్యాప్తి...

Updated : 22 Nov 2022 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా పాలనలోని హాంకాంగ్‌ సైతం కరోనా కట్టడికి కఠిన నిబంధనలు పాటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇక్కడి ఓ పెంపుడు జంతువుల దుకాణంలో మహమ్మారి కలకలం రేగింది. ఇందులో పనిచేసే వ్యక్తికి డెల్టా వేరియంట్‌ సోకి, అది ఇతరులకూ వ్యాప్తి చెందింది. దీంతో అధికారులు వేల మందిని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలోనే ఇక్కడి కుందేళ్లు, హ్యామ్‌స్టర్లు(ఎలుక జాతికి చెందినవి) తదితర జంతువులకూ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 11 హ్యామ్‌స్టర్‌లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఇక్కడి 34 పెంపుడు జంతువుల దుకాణాల్లోని సుమారు రెండు వేల హ్యామ్‌స్టర్‌లను చంపాలని నిర్ణయించారు. గతేడాది డిసెంబర్ 22 తర్వాత ఇక్కడ ఆ జంతువులను కొనుగోలు చేసిన వారు.. వాటిని తమకు అప్పగించాలని, వీధుల్లో వదలొద్దని చెప్పారు. ఈ మేరకు అత్యవసర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

హాంకాంగ్‌ ఆరోగ్య కార్యదర్శి సోఫియా చాన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘పెంపుడు జంతువుల నుంచి మానవులకు వైరస్‌ వ్యాప్తి చెందుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ, ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు హ్యామ్‌స్టర్‌ల దిగుమతులు, అమ్మకాలపై నిషేధం విధించారు’ అని చెప్పారు. యజమానులు కూడా వాటిని ముద్దు పెట్టుకోవద్దని హెచ్చరించారు. తమ పెట్‌లను తాకిన తర్వాత, వాటి ఆహారాన్ని, ఇతర వస్తువులను ముట్టుకున్న అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని స్థానిక వెటర్నరీ అధికారులు తెలిపారు. ఎవరైనా హ్యామ్‌స్టర్‌లను పెంచుతున్నట్లయితే.. వాటిని బయటకు తీసుకురావద్దన్నారు. ఇదిలా ఉండగా.. దాదాపు మూడు నెలలపాటు ఎలాంటి లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసులు లేని హాంకాంగ్‌లో.. ఈ ఏడాదిలో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు రాకపోకలు, ఇతర సామాజిక కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని