World Bank: ఉక్రెయిన్‌ను పునర్నిర్మించాలంటే.. రూ.33లక్షల కోట్లు అవసరం..!

రష్యా దాడులతో పూర్తిగా నాశనమైన ఉక్రెయిన్‌ను మళ్లీ పునర్నిర్మించాలంటే 411 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.33లక్షల కోట్లు) ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంకు (World Bank) అంచనా వేసింది.

Published : 24 Mar 2023 01:38 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా మొదలుపెట్టిన దురాక్రమణ ఏడాది పూర్తైనా కొనసాగుతూనే ఉంది. భారీ స్థాయిలో క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌ నగరాలను రష్యా (Russia) సేనలు ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో కొన్ని నగరాలు ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఇలా ఆధునిక ప్రపంచంలో కనీవినీ ఎరుగని నష్టాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా నాశనమైన ఉక్రెయిన్‌ను మళ్లీ పునర్నిర్మించాలంటే 411 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.33లక్షల కోట్లు) ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంకు (World Bank) అంచనా వేసింది. ధ్వంసమైన భవనాల శిథిలాల తొలగింపునకే 5బిలియన్‌ డాలర్లు (రూ.40వేల కోట్లు) అవుతుందని లెక్క కట్టింది.

ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా ఏడాది తర్వాత కూడా క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో శిథిలాల తొలగింపు.. పునర్నిర్మాణంపై ఉక్రెయిన్‌, ఐరాస, యూరోపియన్‌ కమిషన్‌తో కలిసి ప్రపంచ బ్యాంకు సంయుక్త నివేదిక విడుదల చేసింది. మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతినడంతోపాటు 80లక్షలకు పైగా ఉక్రెయిన్ పౌరులు పేదరికంలోకి వెళ్లిపోయినట్లు అంచనా వేసింది. ఇళ్లు కూలిపోవడం మొదలు మానవ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంది. భవనాలు దెబ్బతినడంతో 135 బి.డాలర్ల నష్టం వాటిల్లిందని తాజా నివేదిక పేర్కొంది. సుమారు 20లక్షల ఇళ్లు దెబ్బతిన్నట్లు అంచనా. ఏడాదిగా కొనసాగుతున్న యుద్ధం వల్ల ఆర్థిక పరిణామాల వల్ల కలిగే నష్టం ఇందుకు అదనమని తెలిపింది.

ఉక్రెయిన్‌ పునరుద్ధరణకు 349 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.28లక్షల కోట్లు) ఖర్చవుతుందని గత సెప్టెంబర్‌లో లెక్క కట్టిన ప్రపంచ బ్యాంకు తాజాగా ఈ నష్టం మరింత ఎక్కువగా ఉందని తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ క్షిపణి దాడులకు పాల్పడుతున్న రష్యా తీరును చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ నష్టం భారీగా ఉండనుందని అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు