USA: మీరు దిల్లీ వెళ్లి చూడండి.. భారత్‌ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: అమెరికా

భారత్‌లో ప్రజాస్వామ్యం చైతన్యవంతంగా ఉందని అమెరికా పేర్కొంది. ఈ మేరకు శ్వేతసౌధం ప్రతినిధి ఒకరు విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. 

Updated : 06 Jun 2023 13:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ (India)లోని ప్రజాస్వామ్యానికి అమెరికా(USA) అధ్యక్ష భవనం శ్వేతసౌధం నుంచి అద్భుతమైన ప్రశంస లభించింది. భారత్‌ చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశమని.. ఎవరైనా సరే న్యూదిల్లీ వెళ్లి ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకోవచ్చని శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహామండలి సమన్వయకర్త జాన్‌ కెర్బీ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన చర్చలోనే ప్రజాస్వామ్య సంస్థల బలం ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

కెర్బీ మాట్లాడుతూ.. ‘‘చూడండి.. ప్రపంచంలోనే ఎవరితోనైనా సరే ఆందోళనకరమైన విషయాలు ఉంటే వెల్లడించడానికి మేము ఎప్పుడూ సిగ్గుపడం. త్వరలో జరగబోయే పర్యటన (మోదీ అమెరికా పర్యటనను ఉద్దేశిస్తూ) ఇరు దేశాల సంబంధాలను మరింత లోతుగా, బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించింది. మీరు చూశారుగా.. ఆస్టిన్‌ (అమెరికా రక్షణ మంత్రి) ఇప్పటికే షంగ్రిలా సదస్సులో భారత్‌తో అమెరికా అదనపు రక్షణ సహకారానికి సంబంధించిన పలు అంశాలను ప్రకటించారు. ఇరుదేశాల వాణిజ్యంలో చాలా ఇబ్బందులున్నాయి. కానీ, భారత్‌ క్వాడ్‌లో సభ్య దేశం. ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో భారత్‌ చాలా కీలకమైన భాగస్వామి. భారత్‌ ఎందుకు చాలా ముఖ్యమో నేను ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకొంటూ పోగలను. ఈ సంబంధాలు మా ఇరు దేశాలకు మాత్రమే ముఖ్యమైనవి కాదు.. బహుముఖంగా చాలా దశల్లో కీలకమైనవి. అందుకే ప్రధాని మోదీతో ఈ అంశాలు మొత్తం చర్చించి.. బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అధ్యక్షుడు బైడెన్‌ ఎదురు చూస్తున్నారు’’ అని వివరించారు.   

మరోవైపు రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా భారత్‌, అమెరికా తాజాగా ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా పలు మిలిటరీ ప్లాట్‌ఫాంలు, హార్డ్‌వేర్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఇందుకోసం భారత పర్యటనకు వచ్చిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌... రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో దిల్లీలో సోమవారం సమావేశమయ్యారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు