Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!

దక్షిణాఫ్రికా (Africa) దేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాలు (Cheetahs) అధికంగా మృత్యువాతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ఆఫ్రికా (Northern Africa) దేశాల నుంచి చిరుతలను తీసుకొచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 

Published : 28 Sep 2023 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా కొన్ని దశాబ్దాల తరువాత భారత్‌లోకి (India) కొత్త చీతాలు అడుగుపెట్టాయి. అయితే, స్వల్ప వ్యవధిలోనే వాటిలో చాలా వరకు వివిధ కారణాలతో మృత్యువాతపడ్డాయి. అవి ఆఫ్రికా ఖండంలోని దక్షిణ దేశాలైన సౌతాఫ్రికా, నమీబియాకు చెందిన చీతాలు. అందుకే ఈసారి ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకొచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతేడాది చీతాలు భారత్‌లోకి ప్రవేశించిన సమయంలో వాటిని పెంచడంలో కొన్ని కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆఫ్రికా రుతువులతో పోలిస్తే భారత్‌లో భిన్నమైన వాతావరణం ఉంటుంది. దాంతో కొన్ని చీతాలు వచ్చిన కొత్తలో ఇబ్బందులు పడ్డాయి. వేసవి, వర్షాకాలాన్ని అవి చలికాలంగా భావించాయి. ఈ విషయాన్ని భారత్‌లోని అటవీశాఖ అధికారులే కాదు.. ఆఫ్రికా నిపుణులు సైతం ఊహించలేదు. 

ముగిసిన సుదీర్ఘ అంతరిక్ష యాత్ర.. క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు!

వింటర్‌ కోట్‌కు అలవాటు పడిన చీతాలు మనదగ్గర అధిక ఎండలకు తట్టుకోలేకపోయాయి. వాటి శరీరంపై విపరీతమైన దురద వచ్చింది. ఉపశమనం కోసం అవి చెట్లు, నేలకు తమ మెడలను రుద్దుకున్నాయి. దాంతో వాటి చర్మానికి గాయాలయ్యాయి. అక్కడ ఈగలు ముసిరి.. ఇతర బ్యాక్టీరియా వృద్ధి చెందడంతో మూడు చిరుతలు మరణించాయని ఓ అధికారి పేర్కొన్నారు. 

దక్షిణాఫ్రికా దేశాలతో పోలిస్తే.. ఉత్తర ఆఫ్రికా, ఈశాన్య దేశాల్లోని చిరుతలు భారతీయ వాతావరణ పరిస్థితులకు సులభంగా అలవాటు పడుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే వాటిపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉంది. అక్కడి చీతాల సంతతి, వాటి ఆరోగ్య పరిస్థితి, బ్రీడింగ్‌ తదితర విషయాలను పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని చీతా ప్రాజెక్టులోని ఓ అధికారి అన్నారు. వాస్తవానికి చీతాల సంతతి ఉత్తర ఆఫ్రికా దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. అయితే, ఇటీవల అక్కడ వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు కొన్ని నేషనల్ పార్క్‌లలో అవి అరుదుగా కన్పిస్తున్నాయి. అల్గేరియా, ఈజిప్ట్‌, నైగర్‌, మాలి వంటి దేశాల్లో కొన్ని మాత్రమే సంచరిస్తున్నాయి. 

ప్రపంచంలోని చాలా దేశాలు ముఖ్యంగా యూకే, యూఎస్‌ సైతం ఉత్తర ఆఫ్రికా దేశాల చిరుతలను దిగుమతి చేసుకున్నాయి. భారత్‌ కూడా అలాగే చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆ దేశాలు సూచిస్తున్నాయి. ‘భవిష్యత్‌లో ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి చీతాలను తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం’ అని చీతా ప్రాజెక్టు హెడ్‌ ఎస్పీ యాదవ్‌ తెలిపారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ రెండు దశల్లో 20 చీతాలను దిగుమతి చేసుకుంది. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో విడిచిపెట్టింది. మార్చి వరకు వివిధ కారణాలతో ఆరు పెద్ద చీతాలు మరణించాయి. మేలో ఎండలకు తాళలేక నమీబియా చీతా జన్మనిచ్చిన మూడు కూనలు చనిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని