Natasha Perianayagam: ఆమె ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిని

ఇండో అమెరికన్‌ విద్యార్థి నటాషా పరియనగమ్‌ (Natasha Perianayagam) ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకుంది. అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ (Johns Hopkins) ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించింది.

Updated : 07 Feb 2023 20:21 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఇండో అమెరికన్‌ (Indian American) విద్యార్థిని నటాషా పెరియనాయగమ్‌ (Natasha Perianayagam) అద్భుత ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితా (world’s brightest Student)లో చోటు సంపాదించింది. అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ (Johns Hopkins) యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌ (సీటీవై) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నటాషా అద్భుత ప్రతిభ కనబరిచింది. ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాల నుంచి 15,300కి పైగా విద్యార్థులు ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనగా కేవలం 27శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. అందులో నటాషా  ప్రథమ స్థానంలో నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చురుకైన విద్యార్థులను, తమ వయస్సు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన వారిని వెలికి తీసేందుకు సీటీవై ప్రతి ఏడాదీ విభిన్న పరీక్షలు నిర్వహిస్తుంటుంది. న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్‌ స్కూల్‌లో చదువుతున్న నటాషా 2021లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాల్గొని తన ప్రతిభ చాటింది. అప్పటికి ఐదో గ్రేడ్‌ (ఐదో తరగతి) చదువుతున్న ఆమె.. ఎనిమిదో తరగతి విద్యార్థి స్థాయి ప్రతిభ చూపింది. వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ విభాగాల్లో 90 శాతం స్కోర్‌ చేసింది. అరుదైన గౌరవాన్ని సాధించింది.

తాజాగా మరోసారి సీటీవై నిర్వహించిన పరీక్షల్లో నటాషా తన ప్రతిభతో మరో మెట్టు ఎక్కింది. గతంలో తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకున్న ఆమె.. తాజాగా ప్రథమ స్థానంలో నిలిచింది. స్కాలాస్టిక్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ),ఏటీసీ, పరీక్షల్లో అద్భుతంగా స్కోర్‌ చేసినట్లు హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందరికంటే ఎక్కువగా స్కోర్‌ చేసినట్లు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ‘‘ఇది విద్యార్థులు ఒక పరీక్షలో సాధించిన విజయాన్ని గుర్తించడం మాత్రమే కాదు. నేర్చుకోవాలనే పట్టుదల, ఆసక్తితో వయస్సు కంటే మించిన జ్ఞానాన్ని సంపాదించారు. దానిని మనమంతా గుర్తించాలి’’ అని సీటీవై ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  షెల్టాన్‌ తెలిపారు. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన నటాషా తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. నటాషాకు బొమ్మలు గీయడమన్నా, పుస్తకాలు చదవడమన్నా మహా ఇష్టమట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని