America: భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం.. 23 ఏళ్లకే చట్టసభలో చోటు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నబీలా సయ్యద్‌ చరిత్ర  సృష్టించారు. 23 ఏళ్లకే ఇల్లినాయిస్‌ రాష్ట్ర చట్ట సభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు. రిపబ్లిక్‌ పార్టీకి చెందిన క్రిస్‌ బోస్‌పై ఆమె గెలుపొందారు.

Updated : 11 Nov 2022 04:28 IST

దిల్లీ:  అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నబీలా సయ్యద్‌ చరిత్ర  సృష్టించారు. 23 ఏళ్లకే ఇల్లినాయిస్‌ రాష్ట్ర చట్ట సభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు. మధ్యంతర ఎన్నికల్లో భాగంగా ఇల్లినాయిస్‌ 51వ డిస్ట్రిక్‌ నుంచి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీకి చెందిన క్రిస్‌ బోస్‌పై ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నబీలాకు  52.3శాతం ఓట్లు వచ్చాయి. ఈ మేరకు తన ఆనందాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘ నా పేరు నబీలా సయ్యద్‌. నాకు 23 ఏళ్లు. ఇండో-అమెరికన్‌ ముస్లిం మహిళని. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించాను. ఇల్లినాయిస్‌ జనరల్‌ అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తుల్లో నేనే పిన్నవయస్కురాలని’’ అని పోస్టు చేశారు.

డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నానని తెలిసిన తర్వాత ప్రజలతో మాట్లాడేందుకే ఎక్కువ సమయం కేటాయించానని నబీలా సయీద్‌ తెలిపారు. ఈ పోటీలో ఎందుకు పాల్గొంటున్నానో వివరించానని తెలిపారు. మెరుగైన నాయకత్వం కోసం సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవ్వడం వల్లే విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు. తనకు వెన్నంటి ఉంటూ మద్దతిచ్చిన ప్రతిఒక్కరికి సామాజిక మాధ్యమాల వేదికగా నబీలా సయ్యద్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ జిల్లాలో ప్రతి ఒక్కరి తలుపు తట్టినట్లు చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల మరొకసారి వారిని కలుస్తానని తెలిపారు.   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని