USA: భారతి సంతతి మహిళపై జాతి వివక్ష..కోర్టులో దావా

అమెరికా (USA) లో జాతి వివక్షకు గురయ్యానంటూ భారత సంతతికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీ బాలచంద్ర (Lakshmi Balachandra)ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె కోర్టులో దావా వేశారు.

Published : 09 Mar 2023 23:25 IST

న్యూయార్క్‌: అమెరికా(USA)లో తాను జాతి వివక్షకు గురైనట్లు భారత సంతతికి చెందిన లక్ష్మీ బాలచంద్ర (Lakshmi Balachandra) ఆవేదన వ్యక్తం చేశారు. మసాచుసెట్స్‌లోని బాబ్సన్‌ బిజినెస్‌ కళాశాల (Babson College)లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆమె.. జాతి, స్త్రీ వివక్షకు గురయ్యానంటూ కోర్టులో దావా వేశారు. వివక్ష కారణంగా ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్థికంగా నష్టపోయాయని, మానసికంగా కుంగిపోయానని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ది బోస్టన్‌ గ్లోబ్‌ వార్తాపత్రిక కథనం వెల్లడించింది.

లక్ష్మీ బాలచంద్ర తన దావాలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆమె 2012లో బాబ్సన్‌ కళాశాలలో ఉద్యోగినిగా చేరారు. అప్పటికే అక్కడ పని చేస్తున్న ప్రొఫెసర్‌ అండ్రూ కార్బెట్‌ నుంచి వేధింపులు మొదలయ్యాయి. అమెకు అనుభవమున్న, పట్టున్న సబ్జెక్టులు కాకుండా ఇతర పాఠ్యాంశాలను బోధించమని ఆండ్రూ ఆమెకు చెప్పేవాడు. గతంలో ఆమెకు ఎమ్‌ఐటీ స్లోన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఆమెకు ప్రాధాన్యత లేని క్లాసులు బోధించమని చెప్పేవాడు. దీంతో విసుగు చెందిన ఆమె సమస్యను మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇక్కడ మహిళలను తక్కువ చేసి చూస్తున్నారని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని లక్ష్మీ బాలచంద్ర తన దావాలో పేర్కొన్నారు. అంతేకాకుండా తెల్లజాతి పురుషులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

పరిశోధనలకు, ఇష్టాయిష్టాలకు, గతంలో పనిచేసిన అనుభవానికి విలువ ఇవ్వలేదని, ఉన్నతస్థానాలకు వెళ్లకుండా అణగదొక్కేశారని లక్ష్మీ బాలచంద్ర ఆరోపించారు.  అవకాశాలు ఎప్పుడొచ్చినా తెల్లవారికే ప్రాధాన్యత ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడిన ఆండ్రూ కార్బెట్‌పై జాతి, స్త్రీ వివక్ష కేసులు నమోదు చేసినట్లు లక్ష్మీ బాలచంద్ర తరఫు న్యాయవాది మోనికా సాహ్‌ వెల్లడించారు. దీనిపై బాబ్సన్‌ కళాశాల కూడా స్పందించింది. సలహాలను, ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొంది. ఏదైన సమస్య ఏర్పడితో కూలంకషంగా చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. 2019 తర్వాత సెలవులపై ఆ సంస్థ నుంచి బయటకొచ్చిన లక్ష్మీ బాలచంద్ర ప్రస్తుతం నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌లో ఫెలోషిప్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని