Pakistan: శ్రీలంక తర్వాత వంతు పాకిస్థాన్‌దేనా..?

భారత్‌ చుట్టుపక్కల దేశాల్లో ఆర్థిక అస్థిరత ప్రబలుతోంది. ఇటీవల శ్రీలంక దివాల తీయగా.. తాజాగా పాకిస్థాన్‌ కూడా అదే బాట పట్టే ప్రమాదం ఉంది.

Published : 14 Jul 2022 01:31 IST

 ఆర్థిక పతనం అంచున దాయాది దేశం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌ చుట్టుపక్కల దేశాల్లో ఆర్థిక అస్థిరత ప్రబలుతోంది. ఇటీవల శ్రీలంక దివాలా తీయగా.. తాజాగా పాకిస్థాన్‌ కూడా అదే బాట పట్టే ప్రమాదం ఉంది. కానీ, ఈ దేశం దివాలా తీసి.. అస్థిరత ఏర్పడితే మన దేశం మరింత ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మత ఛాందసవాదం ప్రబలడం, అక్కడి అణ్వస్త్రాలు తాలిబన్‌ మూకల చేతిల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రతి నెలా పాక్‌ విదేశీ రిజర్వులు అడుగంటుతున్నాయి. ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగి లీటరు పాల ధర 260 పాకిస్థానీ రూపాయలుగా ఉంది. ఇక విద్యుత్తు సంక్షోభం అత్యంత తీవ్రంగా ఉంది. వీటికి తోడుగా చైనా అప్పు ఉండనే ఉంది. దీనికి అదనంగా గత నెలాఖరున చైనా మరో 2.3 బిలియన్‌ డాలర్ల రుణం విదిల్చింది. దీని వడ్డీ రేటు మాత్రం పీఎంఎల్‌-ఎన్‌ సర్కారు గోప్యంగా ఉంచింది. ఇవి దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూపించలేవు. ఇలాంటివి గతంలో శ్రీలంకలో సంక్షోభానికి ముందు కనిపించిన పరిణామాలే. ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి అక్కడి ప్రభుత్వం గాడిదల పెంపకం, ప్రజలు టీ తక్కువ తాగడం వంటి విచిత్రమైన మార్గాలపై కూడా దృష్టిపెట్టింది.

అప్పుల పర్వతం..

2021 జూన్‌ నాటికి పాకిస్థాన్‌ విదేశీ అప్పు 86.4 బిలియన్‌ డాలర్లు. అవి మార్చి 2022 నాటికి 128 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీ అప్పులు పాక్‌కు గుదిబండగా మారాయి. చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌పై అప్పు ఏకంగా 64 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2014లో ఇది 47 బిలియన్‌ డాలర్లు. మరోపక్క పాక్‌ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో పడిపోవడం కూడా చెల్లింపుల మొత్తాన్ని గణనీయంగా పెంచింది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో పాక్‌ చెల్లించాల్సిన మొత్తం 10.8886 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

కరెన్సీ పతనం

పాకిస్థాన్‌ కరెన్సీ విలువ గణనీయంగా పడిపోతోంది. డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.30కిపైగా విలువ కోల్పోయిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తాజాగా అది ఒక డాలర్‌కు రూ.207 వద్దకు చేరింది. అదే సమయంలో కరెంటు ఖాతా లోటు పెరిగింది. ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ వద్ద 2019 తర్వాత అతి తక్కువ విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నాయి. గత నెల చైనా నుంచి 2.3 బిలియన్‌ డాలర్లు అప్పు వచ్చినా మొత్తం రిజర్వు 10 బిలియన్‌ డాలర్ల లోపే ఉంది. 

మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన కారణంగా ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ గ్రేలిస్టులో పాక్‌ చోటు సంపాదించుకొంది. ఫలితంగా ఇన్వెస్టర్లు ఆ దేశం వైపు కన్నెత్తి చూడటంలేదు. దీంతో విదేశీ మారకద్రవ్యం వచ్చే మార్గాలు కుదించుకుపోయాయి. దీంతో కొత్త అప్పులు చేసి.. పాత అప్పులు తీర్చాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి త్రైమాసికంలో చెల్లించాల్సిన డాలర్ల కోసం అధిక మొత్తంలో ప్రభుత్వం వడ్డీకి నిధులు తెస్తోందని డాన్‌ పత్రిక కథనంలో పేర్కొంది. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌, ప్రపంచ బ్యాంక్‌ల నుంచి వివిధ ప్రాజెక్టులకు అందాల్సిన నిధులు నిలిచిపోయాయి. దీంతో అధిక వడ్డీకి వాణిజ్య రుణాలు తీసుకొచ్చి అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఐఎంఎఫ్‌ నిబంధనలు పాటించలేక..

ఐంఎంఎఫ్‌ కఠిన షరతులను అమలు చేయాల్సి ఉండటంతో పాకిస్థాన్‌ అప్పుల కోసం చైనా, సౌదీ, యూఏఈ వంటి దేశాలను కూడా ఆశ్రయిస్తోంది. 2018లో పాకిస్థాన్‌ ఒక సారి బెయిలౌట్‌ ప్యాకేజీ కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించింది. దీంతో బడ్జెట్‌ లోటు తగ్గించాలని, బ్యాంకింగ్‌, పన్ను వ్యవస్థను మెరుగుపర్చాలని, పేదలకు సామాజిక భద్రత పెంచాలని, విదేశీమారక ద్రవ్య విలువ నియంత్రణలో పాక్‌ కేంద్ర బ్యాంక్‌ జోక్యం తగ్గించుకోవాలని పేర్కొంది. పాక్‌ వీటిల్లో అతి తక్కువ షరతులను మాత్రమే పూర్తి చేసింది. 2013, 2016ల్లో విదేశీ అప్పులు తీసుకొంది.

2021లో పాక్‌ మరోసారి ఐఎంఎఫ్‌ వద్దకు వెళ్లింది. కానీ, ఆ చర్చలు విఫలం కావడంతో చైనా, సౌదీ అరేబియా సాయం కోరింది. మరోవైపు యూఏఈ కూడా సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్‌ ద్వారా పాక్‌ ప్రభుత్వ రంగ కంపెనీల్లో 10 శాతానికి పైగా వాటా కొనుగోలుకు ఆఫర్‌ ఇచ్చింది. మళ్లీ తాజాగా ఐఎంఎఫ్‌ వద్ద నుంచి 2 బిలియన్‌ డాలర్లను కోరింది. కానీ, కఠినమైన ముందస్తు షరతుల కారణంగా ఈ చర్చల్లో పురోగతి లేదు.

భారీగా దిగుమతులు..

మరో వైపు దేశీయ అవసరాల కోసం దిగుమతులు మాత్రం తగ్గడంలేదు. 2022 ఆర్థిక సంవత్సరంలో జూన్‌ 30 నాటికి పాక్‌ 80 బిలియన్‌ డాలర్ల విలువైన సరకులు దిగుమతి చేసుకొంది. ఫలితంగా కరెంటు ఖాతా లోటు పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న 13.2 బిలియన్‌ డాలర్ల కరెంటు ఖాతా లోటు, విదేశీ అప్పులు చెల్లింపుల నిమిత్తం మరో 12 బిలియన్‌ డాలర్ల వరకూ అవసరం ఉంటుంది.

ఆర్థిక సంక్షోభం తప్పించుకొనే దారుల్లేవా..?

పాకిస్థాన్‌ ఇష్టమున్నా లేకపోయినా.. ఐఎంఎఫ్‌ చెప్పిన ప్రోగ్రామ్‌ను అమలు చేయాల్సిందే. ఆర్థిక సంస్కరణలు చేపట్టి మార్కెట్‌ నమ్మకాన్ని చూరగొనాలి. దిగుమతులు, వ్యయాల్లో భారీ కోత విధించాల్సిందే. అనవసరమైన ప్రాజెక్టులకు కేటాయింపులను ఆపేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచింది. గతంలో ఇంధనం, విద్యుత్తుపై భారీ రాయితీలు ఇస్తే తాము సాయం చేయమని ఐఎంఎఫ్‌ తేల్చి చెప్పింది. దీంతో పాక్‌ ధరలను పెంచింది.

గతంలో శ్రీలంక వద్ద విదేశీ మారక ద్రవ్యం హరించుకు పోగానే దివాలా ప్రకటించింది. ఆ తర్వాత ఇంధనం, ఆహారం ఇతర నిత్యావసరాలకు కొరత తీవ్రమైంది. పాక్‌ కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే పాక్‌ను సౌదీ, యూఏఈ, చైనా వంటి మిత్రదేశాలు కొంత ఆదుకొనే అవకాశం మాత్రం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని