ISI: పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ రెండో ర్యాంక్‌ స్థాయి అధికారి హతం..!

పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐలో రెండోర్యాంక్‌ స్థాయి అధికారి ఓ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఉగ్రవాదులు పక్కా సమాచారంతోనే ఆయన బృందంపై దాడి చేశారు. 

Updated : 22 Mar 2023 13:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌(Pakistan)కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ(ISI)లో రెండో అత్యున్నత అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఐఎస్‌ఐలో బ్రిగేడియర్‌ హోదాలో పనిచేస్తున్న ముస్తఫా కమాల్‌ బార్కీ ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ పేర్కొంది. ఈ ఎన్‌కౌంటర్‌ దక్షిణ వజీరిస్థాన్‌లోని అంగూర్‌ అడ్డలో చోటు చేసుకొన్నట్లు పాక్‌ పత్రిక డాన్‌ తెలిపింది. ఈ ఎన్‌కౌంటర్‌ను ముస్తఫా లీడ్‌ చేస్తుండగా తూటాలు తగిలినట్లు వెల్లడించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముస్తఫా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌కు నాయకత్వం వహిస్తున్నట్లు పాక్‌ పేర్కొంది. 

ముస్తఫా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారి కాదు. ఆయన ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉగ్రవాదులకు లీకైంది. దీంతో వారు ఆయన్ను చుట్టుముట్టడంతో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. తెహ్రీక్‌ ఇ తాలిబన్లపై పాకిస్థాన్‌ చేస్తున్న పోరాటంలో ఇదో పెద్ద ఎదురుదెబ్బ. ముస్తఫా మృతికి పాక్‌ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ సంతాపం తెలిపారు. ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లిస్తారన్నారు. మరోవైపు పాక్‌ ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్‌ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో పోలీసులు, రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు గణనీయంగా పెరిగిపోయాయి. ఇటీవల పెషావర్‌లోని మసీద్‌లో జరిగిన బాంబు పేలుడులో దాదాపు 100 మంది పోలీసులు మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని