Iran: ఇరాన్ నట్టింట్లో ఇజ్రాయెల్ వేగులు..!
ఇరాన్లో కీలక వ్యక్తులు వరుసగా హత్యలకు గురవుతున్నారు.. వీరిలో ఆ దేశ అత్యున్నత దళమైన ఐఆర్జీసీ ఖుద్స్ఫోర్స్ నాయకులు.. శాస్త్రవేత్తలు ఉన్నారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు
సమాచారం లీక్ నుంచి హత్యల వరకూ మొస్సాద్పైనే అనుమానాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఇరాన్లో కీలక వ్యక్తులు వరుసగా హత్యకు గురవుతున్నారు. వీరిలో ఆ దేశ అత్యున్నత దళమైన ఐఆర్జీసీ ఖుద్స్ఫోర్స్ నాయకులు.. అణు, క్షిపణి శాస్త్రవేత్తలు ఉన్నారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు కర్నల్స్, క్షిపణుల తయారీ విభాగంలోని కీలక శాస్త్రవేత్త అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఖుద్స్ ఫోర్స్ అధినేత సులేమానీ, అణు శాస్త్రవేత్త ఫక్రిజాదే హత్యల తర్వాత చోటుచేసుకొన్న అతి కీలక వ్యక్తుల మరణాలివి. మరోపక్క ఇరాన్లో అత్యంత రహస్యంగా భద్రపర్చిన డాక్యుమెంట్లు ఇజ్రాయెల్ చేతిలో పడ్డాయి. దీంతో అణు ఒప్పందం చర్చలకే ఆటంకంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలతో ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
‘యూనిట్ 840’ కేంద్రంగా కుట్ర కోణాలు..
ఇరాన్ సైన్యంలో రివల్యూషనరీ గార్డ్స్ దళం అత్యంత శక్తిమంతమైంది. దీనిలో ఖుద్స్ ఫోర్స్ అనే విభాగం విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ దళంలో ‘యూనిట్ 840’ అనే దళం విదేశాల్లో హత్యలు చేయడం, ఇజ్రాయెల్ అధికారులను లక్ష్యంగా చేసుకోవడం వంటి పనులు చేస్తుంది. దీంతో ఇటువంటి ఓ దళం ఉందని కూడా ఇరాన్ బహిరంగంగా అంగీకరించదు. అసలు ఈ దళం సభ్యుల ఫొటోలు కూడా ఎన్నడూ బహిర్గతం కావు. గత వారం మధ్యలో ఈ దళానికి చెందిన కర్నల్ అలీ ఇస్మాయిల్ జాదే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ప్రమాదవశాత్తు మరణించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అతడు బాల్కనీపై నుంచి కింద పడి చనిపోయినట్లు స్థానిక న్యూస్ చానళ్లు చెబుతున్నాయి. అతని మరణంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సంతాప ప్రకటన వెలువడలేదు. ఇలా జరగడం ఇరాన్లో చాలా అరుదు. అంతేకాదు.. ఇస్మాయిల్ జాదే ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా దళాలు మోహరించాయి. అంత్యక్రియలను మారుమూల గ్రామంలో అత్యంత రహస్యంగా నిర్వహించారు.
గత నెలలో యూనిట్ 840కి చెందిన సీనియర్ కర్నల్ హసన్ సయ్యద్ ఖొదాయోను ఇరాన్ రాజధానిలో టెహ్రాన్లో పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యకు అవసరమైన సమాచారం కర్నల్ ఇస్మాయిల్ జాదే నుంచి శత్రువులకు చేరిందనే అనుమానంతో ఐఆర్జీసీ దళమే అతన్ని అంతమొందించిదనే ప్రచారం జరుగుతోంది. ఖొదాయో మరణించినప్పుడు సంతాపం ప్రకటించిన ఇరాన్.. ఇస్మాయిల్ జాదే మరణించాక మౌనంగా ఉండటం ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తోంది.
ఖొదాయో హత్య భిన్నం..
ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన అణు, క్షిపణి శాస్త్రవేత్తలు, అల్-ఖైదా నేతలను మాత్రమే ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్లోనే హతమారుస్తూ వస్తోంది. సిరియా వంటి ప్రాంతాల్లో ఐఆర్జీసీ అధికారులను లక్ష్యంగా చేసుకొంటోంది. కానీ, ఇరాన్లోని టెహ్రాన్లో పట్టపగలు ఐఆర్జీసీ కర్నల్ను హతమార్చడం ఇదే తొలిసారి. కర్నల్ హసన్ సయ్యద్కు గతంలో ఇజ్రాయెల్ అధికారులపై దాడులకు క్రుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. 2012లో దిల్లీలో ఇజ్రాయెల్ రాయబారి కుటుంబంపై దాడిలో కూడా ఇతడి హస్తం ఉందని భావిస్తున్నారు.
క్షిపణి శాస్త్రవేత్త అనుమానాస్పద మృతి
ఇరాన్ క్షిపణి, డ్రోన్ల అభివృద్ధి ప్రాజెక్టులో పనిచేస్తున్న కీలక శాస్త్రవేత్త అయూబ్ ఎతెజారె అనుమానాస్పద స్థితిలో మే 31వ తేదీన మృతి చెందారు. ఆయన తిన్న ఆహారం విషపూరితం కావడంతో మరణించినట్లు వార్తలొచ్చాయి. యజాద్ నగరంలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో ఈయన పనిచేస్తున్నారు. ఏరోస్పెస్ విభాగంలో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. ఈ మరణం వెలుగులోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే కర్నల్ అలీ ఇస్మాయిల్ జాదే మరణించడం గమనార్హం.
బెన్నెట్ ఆక్టోపస్ డాక్ట్రీన్కు పదును..
తాజాగా ఇరాన్ గడ్డపై చోటు చేసుకొంటున్న హత్యలు ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్ ప్రతిపాదించిన ఆక్టోపస్ డాక్ట్రీన్ (సిద్ధాంతం)కు అనుగుణంగానే ఉన్నాయనే విశ్లేషణలున్నాయి. 2018లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో బెన్నెట్ హెర్జిలియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ డాక్ట్రీన్ను వెల్లడించారు. ‘‘ఇరానియన్లు చనిపోవడానికి ఇష్టపడరు. కానీ, వేరేవారిని చనిపోవడానికి పంపడం వారికి చాలా తేలిక. అలా వచ్చిన టెంటికల్స్తో (ఆక్టోపస్ చేతులు) మనం పోరాడి రక్తం చిందిస్తుంటే.. తల మాత్రం కుర్చీలో కూర్చొని నవ్వుతుంటుంది. ఇప్పుడు ఆక్టోపస్ టెంటికల్స్ను కాకుండా తలపై గురిపెట్టే సమయం ఇజ్రాయెల్కు వచ్చింది’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత 2019లో రక్షణ మంత్రిగా బెన్నెట్ బాధ్యతలు చేపట్టాక ఈ వ్యూహం మరింత పదును తేలింది. తాజాగా ఇరాన్ గడ్డపై జరుగుతోన్న హత్యలు దీనిలో భాగమనే అనుమానాలున్నాయి.
ఇరాన్ అణు రహస్యాలు లీక్..
ఇరాన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నుంచి తస్కరించిన పత్రాలను దుర్వినియోగం చేయనుందని ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్తాలి బెన్నెట్ ఆరోపించారు. దీనికి సంబందించి వాల్స్ట్రీట్ జర్నల్ రాసిన ఒక కథనాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2004-06 మధ్యలో పత్రాలను ఇరాన్ అధికారులు దుర్వినియోగం చేసి.. అణు పరిశోధనలకు సంబధించిన ఆధారాలను తుడిచి వేస్తున్నారని పేర్కొన్నారు.
2018లో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ రహస్య ఆపరేషన్ నిర్వహించి 1,00,000 పత్రాలను ఇరాన్ నుంచి అపహరించింది. తర్వాత ఆ పత్రాలను నాటి ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రపంచం ఎదుట ఉంచారు. తాజాగా బెన్నెట్ ఆరోపించిన పత్రాలు 2018లో మొస్సాద్ సంపాదించిన వాటిల్లోనివే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్