Giorgia Meloni: కుమార్తెతో కలిసి జీ-20కి ఇటలీ ప్రధాని.. స్వదేశంలో విమర్శల వెల్లువ!

ఇండోనేషియా వేదికగా ఇటీవల జీ-20 సదస్సు(G20 Summit) జరిగిన విషయం తెలిసిందే. తన ఆరేళ్ల చిన్నారితో కలిసి ఈ సదస్సుకు హాజరు కావడంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni)పై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వాటిని ఆమె తిప్పికొట్టారు.

Published : 19 Nov 2022 02:16 IST

రోమ్‌: ఇండోనేషియా వేదికగా ఇటీవల జీ-20 సదస్సు(G20 Summit) జరిగిన విషయం తెలిసిందే. తన ఆరేళ్ల చిన్నారితో కలిసి ఈ సదస్సుకు హాజరు కావడంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni)పై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వాటిని ఆమె తిప్పికొట్టారు. ‘నన్ను విమర్శిస్తోన్న వారికి ఒకటే ప్రశ్న. నేను నా కుమార్తెను ఎలా పెంచాలనేది మీకు సంబంధించిన విషయమని అనుకుంటున్నారా? కానే కాదు. తల్లిగా బాధ్యతల విషయంలో నాకు నచ్చినట్లుగా వ్యవహరించే హక్కు ఉంది. చిన్నారికి అమ్మ దూరంగా ఉందనే బాధ తెలియకుండా చేస్తూనే.. ఈ దేశం కోసం పనిచేసే హక్కు కూడా ఉంది’ అని కుండబద్దలు కొట్టారు.

మెలోనీ తన కుమార్తెను జీ-20 సదస్సుకు తీసుకెళ్లడాన్ని విమర్శిస్తూ.. స్థానికంగా ఓ వార్తాపత్రికలో కథనం ప్రచురితమైన తర్వాత ఈ వివాదం మొదలైంది. ‘కార్మికులు ఎవరూ తమ కుమార్తెలను ఫ్యాక్టరీకి తీసుకెళ్లరు. ఒకవైపు తన బిడ్డకు కూడికలు, తీసివేతలు చెబుతూనే.. మరోవైపు చైనాతో చర్చలు జరపడంలో మెలోనీకి ఎలాంటి సమస్యలు ఎదురుకావేమో! ఆమె స్థానంలో నేనుంటే.. బాలిలో పెద్దలతోనే కలిసి పర్యటిస్తా. ‘ఏమైనా ఉంటే మీ నాన్నను అడుగు. నేను త్వరలోనే తిరిగొస్తా’ అని కుమార్తెకు చెబుతా’ అని అందులో వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఈ తరహా విమర్శలపై మెలోనీ తాజాగా గట్టిగా స్పందించారు.

ఇటలీ ప్రతిపక్ష నేత, అజియోన్‌ పార్టీకి చెందిన మారా కార్ఫాగ్నా సైతం మెలోనీకి అండగా నిలిచారు. ‘నేనూ నా కుమార్తెను సదస్సులకు, రాజకీయ సమావేశాలకు తీసుకెళ్లా. మాతృమూర్తుల అభిప్రాయాలను ఎవరూ నిర్ణయంచకూడదు’ అని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన మెలోని.. ఇటీవలే దేశ తొలి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. జీ-20 సభ్యదేశాల అధినేతల్లో ఆమె ఒక్కరే మహిళ కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని