Japan: జనాభా ఇలాగే తగ్గిపోతే.. జపాన్‌ మాయం...!

జపాన్‌ జనాభా (Population) వేగంగా క్షీణిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జపాన్‌ (Japan) అదృశ్యమవుతుందని ఆ దేశ ప్రధానమంత్రి సలహాదారు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 06 Mar 2023 17:59 IST

టోక్యో: జపాన్‌లో (Japan) కొంతకాలంగా జననాల రేటు గణనీయంగా పడిపోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది కూడా ఈ సంఖ్య భారీగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీనిపై ఆ దేశ పాలకులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జననాల రేటు క్షీణించడాన్ని (Population Decline) నిరోధించకుంటే జపాన్‌ అదృశ్యమవుతుందని ప్రధానమంత్రి సలహాదారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనన, మరణాలకు సంబంధించి గతేడాది నివేదికలు ఇటీవల వెల్లడైన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు.

దేశం అదృశ్యమే..

జననాల రేటుకు (Population) సంబంధించి జపాన్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఓ నివేదిక విడుదల చేసింది. గతేడాదిలో జననాల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గిపోయినట్లు అందులో పేర్కొంది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన జపాన్‌ ప్రధానమంత్రి సలహాదారు మసాకో మోరీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇదే పరిస్థితి కొనసాగితే.. దేశం అదృశ్యమవుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కనుమరుగయ్యే దశలో ఉండటం ప్రజలకు ఎంతో హాని కలిగించే అంశమని.. ఎంతో మంది చిన్నారులను భవిష్యత్తులో ఈ సమస్య వేధిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

జననాల కంటే మరణాలే అధికం..

జపాన్‌లో గతేడాది జననాల సంఖ్య కంటే మరణాల సంఖ్య దాదాపు రెట్టింపుగా నమోదైంది. ఆ సంవత్సరం 8లక్షల జననాలు రికార్డు కాగా మరణాలు మాత్రం 15.8లక్షలు నమోదయ్యాయి. 2008లో జపాన్‌ జనాభా 12.8కోట్లుగా ఉండగా ప్రస్తుతం 12.4కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో 65ఏళ్ల వయసు కలిగిన జనాభా కూడా 29శాతానికి పైగా పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. జనాభా పెరుగుదల కనిపించక పోగా.. క్షీణించడం వేగంగా జరుగుతున్నట్లు నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. ఇవి జనాభా క్షీణతపై ముందస్తు అంచనాల కంటే అధికంగా ఉండటం అక్కడి ప్రభుత్వానికి కలవరపాటుకు గురిచేస్తోంది.

సవాళ్ల ముప్పు..

కొంతకాలంగా దేశ జనాభా క్రమంగా క్షీణించడం కాకుండా.. అత్యంత వేగంగా పడిపోతున్నట్లు ప్రధానమంత్రి సలహాదారు మసాకో మోరీ వెల్లడించారు. ఈ భారీ క్షీణత ఇప్పుడు పుట్టే పిలల్లకు భవిష్యత్తులో సమస్యలకు కారణమవుతుందన్నారు. దీనిని అడ్డుకోకపోతే సామాజిక భద్రతా వ్యవస్థ కుప్పకూలుతుందని.. పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందన్నారు. వీటితోపాటు భద్రతా బలగాల నియామకాలకూ ఈ పరిణామాలు తీవ్ర ఆటంకం కలిగిస్తాయని వాపోయారు. ఈ నేపథ్యంలో జనాభా క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకుచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని