US: ప్రతిరోజు లక్షల్లో కేసులు.. కరోనా కట్టడికి అమెరికా కీలక నిర్ణయం

యూఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది​. ఇంట్లోనే కొవిడ్​-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్​ కిట్లతో పాటు వైరస్​ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్​95 మాస్క్​లను......

Updated : 10 Aug 2022 11:42 IST

వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌ విజృంభణతో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. పలు కట్టడి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది​. ఇంట్లోనే కొవిడ్​-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్​ కిట్లతో పాటు వైరస్​ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్​95 మాస్క్​లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతోపాటు వచ్చే వారం నుంచి 1,000 మంది సైనిక వైద్య సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరిస్తామని తెలిపారు. వైద్య సౌకర్యాలను పెంచటం, సిబ్బంది కొరతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒమిక్రాన్​ వేరియంట్​ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్వేతసౌంధంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.

‘కరోనా కేసులు గరిష్ఠంగా నమోదవుతున్న క్రమంలో మనమంతా నిరుత్సాహంతోనే నూతన ఏడాదిలోకి ప్రవేశించామని తెలుసు. ఇప్పటికీ వ్యాక్సిన్​ తీసుకోనివారికే ఎక్కువ ప్రమాదం. టీకా తీసుకున్నవారు వైరస్​ బారినపడినా తీవ్ర అనారోగ్యానికి గురికావటం, మరణించటం వంటివి నమోదు కావటం లేదని గణాంకాలు చెబుతున్నాయి’ అని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలోనే.. చాలా మంది వైద్య సిబ్బంది వైరస్​ బారినపడి హోమ్​ క్వారంటైన్​కు వెళ్తున్నారు. దీంతో పెద్ద పెద్ద ఆసుపత్రులు సైతం సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. సిబ్బంది లేక.. వైరస్‌కు గురైన వైద్య సిబ్బంది సైతం పలు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ కొరతను తగ్గించేందుకు ఫెడరల్​ మెడికల్​ సిబ్బందిని ప్రభుత్వం పలు రాష్ట్రాలకు పంపించింది. వీటికి అదనంగా మిలిటరీ వైద్యులను అవసరమైన ప్రాంతాల్లోకి పంపనున్నారు.

అమెరికాలో క్రితం రోజుతో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినా భారీగానే కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 8,06,493 మందికి పాజిటివ్​గా తేలింది. 1,969 మంది వైరస్​తో మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8,69,212కు చేంది. కేసుల సంఖ్య 6,23,64,475కి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని