Lecturer: గట్టిగా మాట్లాడుతోందని లెక్చరర్‌ తొలగింపు.. ₹కోటి చెల్లించమన్న కోర్టు

గట్టిగా మాట్లాడుతోందనే నెపంతో ఓ మహిళా లెక్షరర్‌ను యూనివర్సిటీ నుంచి తొలగించగా.. ఆమెకు రూ.కోటి చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది......

Published : 20 Jan 2022 01:56 IST

లండన్‌: లింగ వివక్షత ప్రదర్శిస్తూ.. గట్టిగా మాట్లాడుతోందనే నెపంతో ఓ మహిళా అధ్యాపకురాలిని యూనివర్సిటీ అధికారులు తొలగించారు. కాగా తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో యూనివర్సిటీకి మొట్టికాయలు వేసిన కోర్టు.. బాధితురాలికి రూ.కోటి పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది.

ఇంగ్లాండ్‌లోని ఎక్సెటెర్‌ యూనివర్సిటీ ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో డా.అనెట్‌ ప్లాట్‌ సీనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. గత 29 ఏళ్లుగా ఆమె అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు ఆమెను ఉన్నట్లుండి ఉద్యోగంలోనుంచి తొలగించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. గట్టిగా మాట్లాడుతున్నాననే కారణంగానే తనను ఉద్యోగం నుంచి తీసేశారని అనెట్‌ కోర్టుకు వెల్లడించారు. పక్షపాతం వహిస్తూ తన ఉద్యోగం తొలగించారని, పై అధికారి మానసిక వేదనకు గురిచేసినట్లు ఆమె వాపోయారు.

‘సాధారణంగానే నా గొంతు గట్టిగా వినిపిస్తుంది. మహిళను, గట్టిగా మాట్లాడుతున్నాననే కారణంతోనే నన్ను ఉద్యోగంలో నుంచి తొలగించారు. నేను అక్కడ దాదాపు మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ లింగ వివక్ష చూపుతూ.. వారు ఈ విధంగా చేశారు’ అంటూ ఆమె కోర్టుకు తెలిపారు. యూనివర్సిటీలోని ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరిన మొదటి మహిళా విద్యావేత్తగా కూడా తాను గుర్తింపు పొందినట్లు అనెట్‌ వెల్లడించారు.

మాజీ లెక్చరర్‌ ఆరోపణలపై యూనివర్సిటీ స్పందించింది. ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులతో ఆమె వ్యవహరించిన తీరుపై డా.అనెట్‌ ప్లాట్‌ను తొలగించినట్లు విశ్వవిద్యాలయం వివరణ ఇచ్చింది. ఆమె నేపథ్యాన్ని గానీ లింగాన్ని గానీ పరిగణనలోకి తీసుకొని తొలగించలేదని పేర్కొంది. కాగా ఇరువురి వాదనలు విన్న ఎంప్లాయ్‌మెంట్‌ ట్రిబ్యునల్‌ అనెట్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఉద్యోగంలో నుంచి ఆమెను అన్యాయంగా తొలగించారని వ్యాఖ్యానించింది. నష్టపరిహారంగా ఆమెకు 100,000 పౌండ్లు (దాదాపు రూ.కోటి) చెల్లించాలని విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని