United Airlines: ఖరీదైన విస్కీ బాటిల్‌లో మద్యం చోరీ..కంగుతిన్న విమాన ప్రయాణికుడు

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి చెందిన విస్కీ బాటిల్‌లోని మద్యం చోరీకి గురైంది. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్‌లైన్స్‌కు ట్వీట్‌ చేశారు.

Published : 30 Mar 2023 18:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మామూలుగా విమాన ప్రయాణికులు తమ సామాను పోయిందని, తారుమారైందని ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ తాజగా యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌(United Airlines)లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి చెందిన విస్కీ బాటిల్‌లోని మద్యం చోరీకి గురైంది. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్‌లైన్స్‌కు ట్వీట్‌ చేశారు. వివరావల్లోకి వెళితే.. శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్‌ ఆంబ్లర్‌ ఇటీవల విమానయానం చేశారు. ఆయన తన బ్యాగులో ఖరీదైన విస్కీ బాటిల్‌ను తీసుకెళ్లారు. కానీ గమ్యస్థానం చేరుకున్నాక బ్యాగ్‌ను తెరచి చూడగా బాటిల్‌లోని మద్యంలో మూడింట ఒక వంతు మాయమయ్యింది. అమెజాన్‌ స్టోర్‌లో ఆ బాటిల్‌ ధర 449.95 ఫౌండ్లు(రూ.45,556). దీంతో ఆగ్రహానికి గురైన ఆయన బాటిల్‌ను ఫొటో తీసి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆ మద్యాన్ని బ్యాగేజ్‌ సిబ్బంది తాగేసి ఉంటారని ఆరోపించారు.

‘‘ఖరీదైన స్కాచ్‌ బాటిల్‌ను బ్యాగులో పెట్టాను. దాన్ని విమాన సిబ్బంది తనిఖీ చేశారు. గమ్యస్థానం చేరుకున్నాక బ్యాగు తెరచి చూస్తే మూడింట ఒక వంతు మద్యం మాయమయ్యింది. బ్యాగులో ఎటువంటి లీకేజీ కాలేదు. నేను దాన్ని సర్దినప్పుడు సీల్‌ చేసి ఉంది. కానీ ఇప్పుడు సీల్‌ తెరచి ఉంది. మద్యాన్ని బ్యాగేజ్‌ సిబ్బందే తాగేసి ఉంటారు’’ అని ఎయిర్‌లైన్స్‌ను టాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌కు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. ఈ ఘటనపై క్షమాపణలు తెలియజేసి ఫిర్యాదు చేయమని కోరింది. ఈ ట్వీట్ చూసిన యూజర్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎక్కువ మంది ఆశ్చర్యపోయారు. ‘ఆ మద్యం మీరే తాగేసి డబ్బుల కోసం ఇలా నటించట్లేదని చెప్పటానికి రుజువు ఏముంది. ఈ విషయాన్ని నిరూపించడం చాలా కష్టం’ అని ఓ యూజర్‌ ట్వీట్ చేశారు. విమాన ప్రయాణికులు తమ బ్యాగులు పోయాయని, తారుమారయ్యాయని తరచుగా ఫిర్యాదులు చేస్తున్నారు. గతేడాది ఇండిగో ప్రయాణికుడు తారుమారైన తన బ్యాగును కనిపెట్టడం కోసం ఏకంగా ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్‌ను హాక్‌ చేశాడు. తోటి ప్రయాణికుడి వివరాలను సేకరించి తన లగేజ్‌ను తిరిగి పొందాడు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని