UK PM Race: బ్రిటన్‌ ప్రధాని రేసులో.. ముందంజలో లిజ్‌ ట్రస్‌..!

బ్రిటన్‌ ప్రధానమంత్రి (UK PM) రేసులో ఉన్న రిషి సునాక్‌ (Rishi Sunak), సొంతపార్టీకి చెందిన ప్రత్యర్థితో పోలిస్తే వెనుకంజలో కొనసాగుతున్నారు.

Published : 15 Aug 2022 01:20 IST

రిషీ సునాక్‌కు విజయావకాశాలు ఇంకా ఉన్నాయంటున్న విశ్లేషకులు

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి (UK PM) రేసులో ఉన్న రిషి సునాక్‌ (Rishi Sunak), సొంతపార్టీకి చెందిన ప్రత్యర్థితో పోలిస్తే వెనుకంజలో కొనసాగుతున్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేత పోటీలో లిజ్‌ ట్రస్‌ (Liz Truss) ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ది అబ్జర్వర్‌ వార్తాపత్రికలో వచ్చిన ఒపీనియమ్‌ సంస్థ చేపట్టిన సర్వేలో 570 మంది కన్జర్వేటివ్‌ సభ్యులు పాల్గొనగా.. లిజ్‌ ట్రస్‌కు 61శాతం, రిషి సునాక్‌కు 39శాతం మద్దతు లభించింది. దాదాపు 22అంశాలపై టోరి మెంబర్లను ప్రశ్నించగా.. దాదాపు సగానికిపైగా ట్రస్‌కే తమ ఓటు వేశారు.

ఇప్పటివరకు లిజ్‌ ట్రస్‌ (Liz Truss) ముందంజలో ఉన్నప్పటికీ పార్టీ నేతగా గెలిచేందుకు రిషీకి (Rishi Sunak) ఇంకా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రస్‌కు సీనియర్‌ కన్జర్వేటివ్‌ సభ్యులు మద్దతు పలుకుతుండగా, సునాక్‌కు మాత్రం యువనేతలు అండగా ఉన్నట్లు తాజా సర్వేలను బట్టి తెలుస్తోంది. అయితే, బోరిస్‌ జాన్సన్‌ను రాజీనామా చేయాలని రిషి సునాక్‌ కోరడం ఆయనకు ప్రతికూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. జాన్సన్‌కి సన్నిహితురాలుగా పేరొందిన ట్రస్‌ మాత్రం బోరిస్‌ జాన్సన్‌ను రాజీనామా చేయాలని కోరకపోవడం ఆమెకు కలసివస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కన్జర్వేటివ్‌ నేతను ఎన్నుకునేందుకు సెప్టెంబర్‌ 2వరకు మాత్రమే గడువుంది. అప్పటిలోగా ఆ పార్టీకి చెందిన టోరీలు పోస్టల్‌, ఆన్‌లైన్‌ ద్వారా తమ ఓట్లను వేయనున్నారు. సెప్టెంబర్‌ 5న తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా గెలిచిన అభ్యర్థే బ్రిటన్‌ నూతన ప్రధానిగా అదేరోజు బాధ్యతలు చేపడతారు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్‌ పార్టీ నేత పోటీలో ఉన్న ఇద్దరి నేతల మధ్య వ్యత్యాసం క్రమంగా పెరుగుతుండడంతో రానున్న మూడు వారాల్లోనే రిషి సునాక్‌ తనకు మరింత మద్దతు పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని