Australia: ఆస్ట్రేలియా ఎన్నికలు.. లోదుస్తుల్లో వెళ్లి ఓటేసిన వందల మంది!

ఆస్ట్రేలియా ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అనేకమంది ఓటర్లు లోదుస్తుల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం చర్చనీయాంశమైంది........

Published : 23 May 2022 01:41 IST

క్యాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీ విజయం సాధించింది. 2007 తర్వాత తొలిసారిగా ఎన్నికల్లో గెలుపొందింది. కాగా ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.  151 స్థానాలున్న సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు శనివారం పోలింగ్ జరిగింది. కరోనా దృష్ట్యా ఆ దేశంలోని 1.70 కోట్ల మంది ఓటర్లలో 48శాతంపైగా ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు. మిగతా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఓటువేసేందుకు అనేకమంది లోదుస్తుల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం చర్చనీయాంశమైంది. మహిళలు స్విమ్‌సూట్‌ ధరించగా, పురుషులు కేవలం అండర్‌వేర్‌లో వచ్చి ఓటేశారు.

‘బడ్జీ స్మగ్లర్స్​’ అనే స్విమ్​వేర్​ కంపెనీ ఇచ్చిన ఓ ఆఫరే వందల మంది లోదుస్తుల్లో రావడానికి కారణమైంది. అండర్​వేర్​లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్​ మీడియాలో షేర్​ చేస్తే తమ బ్రాండెడ్​ స్విమ్​వేర్​ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. కాగా ఈ ఆఫర్‌ను చేజిక్కించుకునేందుకు అనేకమంది రంగురంగుల అండర్‌వేర్‌లలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసి, ఆ ఫొటోలను #SmugglersDecide హ్యాష్​ట్యాగ్​తో పోస్ట్ చేశారు. తమ ఆఫర్​కు అనూహ్య స్పందన వచ్చిందంటూ బడ్జీ స్మగ్లర్స్ ఆనందం వ్యక్తం చేసింది. ఒకరిద్దరు పాల్గొంటారని భావిస్తే వందల మంది ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేసింది. ఈ ఛాలెంజ్​లో పాల్గొన్నవారందరికీ సోమవారం నుంచి బహుమతులు అందజేస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని