Afghanistan: అఫ్గాన్‌లో ‘చైనీస్‌ గెస్ట్‌ హౌస్‌‌‌’ పై ఉగ్రదాడి

అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లోని ఓ చైనీస్‌ హోటల్‌పై దాడి జరిగింది. ఈ భవనంలో బాంబు పేలుడుకు పాల్పడిన సాయుధులు కాల్పులతో విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది.

Published : 12 Dec 2022 17:57 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ (Afghanistan) రాజధాని కాబుల్‌ (Kabul) మరోసారి బాంబు పేలుడు (Bomb Blast), కాల్పులతో దద్దరిల్లింది. ఈ నగరంలో అత్యంత రద్దీగా ఉండే షహర్‌-ఇ నావ్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉగ్రదాడి జరిగింది. ‘చైనీస్‌ గెస్ట్ హౌస్‌ (Chinese Guest House)’గా పిలిచే ఈ భవనానికి తరచూ చైనా వ్యాపారులు వస్తుంటారు. భారీ పేలుడుతో పాటు తుపాకీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తర్వాత కొందరు సాయుధులు భవనంలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హోటల్‌లో కాల్పులు జరుగుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టత రాలేదు. కాగా.. అఫ్గాన్‌లో చైనీయుల భద్రతపై చైనా రాయబారి వాంగ్‌ యు.. నిన్న అఫ్గాన్‌ విదేశాంగ శాఖ అధికారులను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం.

అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రదాడి, కాల్పుల ఘటనలు మరింత పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఇస్లామిక్‌ స్టేట్‌ జరిపిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు రష్యన్‌ ఎంబసీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. నిన్న అఫ్గాన్‌-పాక్‌ సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. బలూచిస్థాన్‌లోని చమన్‌ జిల్లాలోపాక్ పౌరులపై తాలిబన్‌ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా, 17 మందికి గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని